న్యూఢిల్లీ: భారత పౌరసత్వం కోసం 7,306 మంది పాకిస్థానీయులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ ఏడాది డిసెంబర్ 14 వరకు భారతీయ పౌరసత్వం కోసం 10,635 దరఖాస్తులు అందినట్లు కేంద్ర హోం వ్యవహారాల శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ బుధవారం పార్లమెంటుకు తెలియజేశారు. ఇందులో సుమారు 70 శాతం దరఖాస్తులు పాకిస్థాన్ జాతీయులకు చెందినవని చెప్పారు. భారత పౌరసత్వం కోసం ప్రస్తుత దరఖాస్తుదారుల వివరాలు, వారి ప్రస్తుత పౌరసత్వం డేటాను కోరుతూ ఎంపీ అబ్దుల్ వహాబ్ అడిగిన ప్రశ్నకు రాయ్ సమాధానమిచ్చారు. ఆఫ్ఘనిస్థాన్ నుంచి 1,152, అమెరికా నుంచి 428, శ్రీలంక నుంచి 223, నేపాల్ నుంచి 189, బంగ్లాదేశ్ నుంచి 161, చైనా నుంచి 10 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు.
మరోవైపు 2018-21 మధ్య పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్లకు చెందిన హిందూ, సిక్కు, క్రిస్టియన్, జైన్, బౌద్ధ మైనారిటీ గ్రూపుల నుంచి అందిన మొత్తం దరఖాస్తుల వివరాలను టీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ కే కేశవ రావు కోరారు. ఎంత మందికి పౌరసత్వం ఇచ్చారని కూడా ఆయన అడిగారు. కేంద్ర హోం వ్యవహారాల శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ దీనికి సమాధానమిచ్చారు. 2018-21 మధ్య ఈ పొరుగు దేశాలకు చెందిన మైనారిటీ సమూహాల నుంచి భారత పౌరసత్వం కోసం కేంద్రం 8,244 దరఖాస్తులను స్వీకరించిందని తెలిపారు. వాటిలో 3,117 మందికి పౌరసత్వం మంజూరు చేసినట్లు చెప్పారు.
కాగా, ఈ ఏడాది సెప్టెంబర్ 30 వరకు గత ఏడేండ్లలో 8.5 లక్షల మంది భారతీయ పౌరులు తమ పౌరసత్వాన్ని వదులుకున్నారని ఈ నెల ప్రారంభంలో లోక్సభకు రాయ్ తెలిపారు. ఈ ఏడాది సెప్టెంబర్ 20 వరకు 1,11,287 మంది భారతీయ పౌరసత్వాన్ని వదులుకున్నారని వెల్లడించారు.