న్యూఢిల్లీ: దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా సాగుతున్నది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 158 కోట్ల టీకా డోసులను పంపిణీ చేశారు. 15-18 ఏండ్ల వయస్కులకు ఈ నెల 3న వ్యాక్సినేషన్ పంపిణీని ప్రారంభించారు. దీంతో ఇప్పటివరకు దేశంలోని 15-18 ఏండ్ల టీనేజర్లలో 50 శాతం మందికిపైగా టీకా తీసుకున్నారని కేంద్ర ఆరోగ్య శాఖమంత్రి మన్సుఖ్ మాండవీయ ప్రకటించారు. కరోనాపై భారత్ జరుపుతున్న పోరులో ఇది ఎప్పటికీ గుర్తుంచుకోదగిన రోజని చెప్పారు.
దేశంలో 15-18 ఏండ్ల వయస్కులైన యువతకు జనవరి 3 నుంచి వ్యాక్సినేషన్ చేస్తున్నారు. దీనికోసం ప్రభుత్వాలు ముమ్మరంగా ఏర్పాట్లు చేశాయి. అన్ని విద్యా సంస్థల్లో వ్యాక్సిన్ కేంద్రాలను ఏర్పాటుచేశాయి. దీంతో టీనేజర్లకు వ్యాక్సినేషన్ వేగంగా కొనసాగుతున్నది. మొదటి డోసు తీసుకున్న నాలుగు వారాల తర్వాత రెండో డోసు ఇవ్వనున్నారు.
వచ్చే మార్చిలో వ్యాక్సినేషన్ మరో దశకు చేరనున్నది. ఇప్పటివకే వయోజనులు, 15-18 ఏండ్ల టీనేజర్లకు వ్యాక్సిన్ ఇస్తుండగా, మార్చిలో 12-14 ఏండ్ల బాలలకు టీకా వేయనున్నామని నీతిఆయోగ్ సభ్యుడు డా. ఎన్కే అరోరా తెలిపారు. దీంతో దేశంలో 12 ఏండ్లలోపు చిన్నారులకు మినహా అందరికి వ్యాక్సిన్ చేరువైనట్లవుతుంది.