కాబుల్, మార్చి 17: అఫ్ఘనిస్థాన్ రాజధాని కాబుల్లో మాదక ద్రవ్యాలకు బానిసైన వారికి చికిత్స అందచేసే దవాఖానపై సోమవారం జరిగిన క్షిపణి దాడిలో వందలాది మంది మరణించారు. పాకిస్థాన్ సైన్యం ఈ దాడికి పాల్పడినట్లు అఫ్ఘాన్ ప్రభుత్వ అధికారులు ఆరోపించగా పాక్ ఖండించింది. మృతుల సంఖ్య ఇప్పటివరకు 400 చేరుకుందని అఫ్ఘాన్ ప్రభుత్వ ఉప అధికార ప్రతినిధి హందుల్లా ఫిత్రత్ మంగళవారం తెలిపారు. మరో 250 మంది వరకు గాయపడ్డారని ఆయన చెప్పారు. మృతులు, క్షతగాత్రులలో ఎక్కువ మంది దవాఖానలో చికిత్స పొందుతున్న రోగులేనని ఆయన తెలిపారు. సోమవారం రాత్రి తమ సైన్యం అఫ్ఘాన్ సైనిక, ఉగ్రవాద మద్దతు గల స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిపినట్లు పాక్ తెలిపింది. పౌరులను లక్ష్యంగా చేసుకుని దాడులు జరపలేదని స్పష్టం చేసింది.
దాడి జరిగిన సమయంలో ఒమిద్ ప్రభుత్వ దవాఖానలో దాదాపు 3,000 మంది రోగులు ఉన్నట్లు తాలిబన్ ఆరోగ్య శాఖ అధికార ప్రతినిధి షరాఫత్ జమాన్ తెలిపారు. బాంబు దాడికి శిథిలమైన భవనంలో మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది శ్రమిస్తున్న వీడియో ఫుటేజీని స్థానిక టీవీ స్టేషన్లు ప్రసారం చేశాయి. మొత్తం దవాఖాన ప్రాంగణమంతా మంటల్లో చిక్కుకుందని దవాఖాన సెక్యూరిటీ గార్డ్డ్ చెప్పాడు. దవాఖానకు చెందిన సిబ్బంది వసతి గృహంలో మొత్తం 25 మంది ఉండగా తాను ఒక్కడినే ప్రాణాలతో బయటపడినట్లు అతను చెప్పాడు. సోమవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో దవాఖాన వద్దకు సైన్యం చేరుకుందని, ఆ సమయంలో అక్కడికి వచ్చిన ఓ యుద్ధ విమానంపై యాంటీ ఎయిర్క్రాఫ్ట్ గన్లు కాల్పులు జరపగా ఆ జెట్ నుంచి దవాఖానపై బాంబులు పడ్డాయని మిద్ స్టానిక్జై అనే మరో సెక్యూరిటీ గార్డు తెలిపాడు.
బాంబుల దాడిలో దవాఖాన భవనం కుప్పకూలిపోయినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. పొగచూరిన మొండి గోడలు, గుట్టలుగా భవన శిథిలాలు అక్కడ దర్శనమిస్తున్నాయి.పాకిస్థాన్తో తమ ఉమ్మడి సరిహద్దు వద్ద కాల్పులు జరిగి తమ పౌరులు నలుగురు మరణించిన కొన్ని గంటల్లోనే ఈ దాడి జరిగినట్లు అఫ్ఘాన్ అధికారులు తెలిపారు. గత కొన్ని రోజుల్లో కాబుల్పై పాక్ క్షిపణి దాడులు జరపడం ఇది మూడవసారి. కాగా, సోమవారం రాత్రి అప్ఘాన్లోని సైనిక స్థావరాలు, ఉగ్రవాద మద్దతు గల సవుపియితపైనే దాడులు నిర్వహించినట్లు పాక్ సమాచార శాఖ ఎక్స్ పోస్టులో స్పష్టం చేసింది. వాస్తవాలను వక్రీకరించి మనోభావాలను రెచ్చగొట్టేందుకే డ్రగ్స్ బాధితుల పునరావాస కేంద్రంపై దాడి జరిగినట్లు అఫ్ఘాన్ చెప్తున్నదని పాక్ ఆరోపించింది. సీమాంతర ఉగ్రవాదానికి తాను ఇస్తున్న మద్దతును సమర్థించుకునేందుకు అఫ్ఘాన్ ఈ చర్యకు పాల్పడినట్లు కూడా పాక్ ఆరోపించింది. కాబుల్లోని దవాఖానపై దాడిని భారత ప్రభుత్వం ఖండించింది. రంజాన్ వేళ ఇలాంటి దాడులకు పాల్పడటం దారుణమని విచారం వ్యక్తం చేసింది. ఇది పిరికి పంద, అమానుష చర్య అని ఆగ్రహం వ్యక్తం చేసింది.