న్యూఢిల్లీ, డిసెంబర్ 26: ఆధునిక సాంకేతికతల్లో ఒకటైన కృత్రిమ మేధ (ఏఐ) ఏటా లక్షల ఉద్యోగాలకు ఎసరు పెడుతున్నది. ఈ సాంకేతికత వినియోగం నానాటికీ పెరుగుతుండటంతో ప్రపంచవ్యాప్తంగా టెక్ కంపెనీలు, స్టార్టప్లు ఉద్యోగులపై వేటు వేస్తున్నాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక మందగమన పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఖర్చులను తగ్గించుకునేందుకు ఉద్యోగులను తొలగిస్తున్నట్టు ఆయా కంపెనీలు చెప్తున్నాయి.
ఇలా గత రెండేండ్లలో (2023 డిసెంబర్ 26 వరకు) ప్రపంచవ్యాప్తంగా 4.25 లక్షల మందికిపైగా ఉద్యోగులు తొలగింపునకు గురయ్యారు. వీరిలో 36 వేల మందికిపైగా ఉద్యోగులు భారత్లోనే ఉద్వాసనకు గురైనట్టు స్పష్టమవుతున్నది. ఈ ఏడాది రిటైల్ టెక్, కన్జ్యూమర్ టెక్, ఫిన్టెక్ రంగాలకు చెందిన కంపెనీలు అధిక సంఖ్యలో ఉద్యోగులను తొలగించినట్టు ‘లేఆఫ్స్.ఎఫ్వైఐ’ వెబ్సైట్ వెల్లడించింది.