(స్పెషల్ టాస్క్ బ్యూరో)హైదరాబాద్ (నమస్తే తెలంగాణ): ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి అధికారం చేపట్టిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వ రంగంలో ఖాళీగా ఉన్న లక్షల ఉద్యోగాలను భర్తీ చేయకుండా నిరుద్యోగుల ఆశలపై నీళ్ళు చల్లుతున్నది. ఒక్క రైల్వే శాఖలోనే 3.12 లక్షల ఖాళీలున్నాయని రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్ ఇటీవల రాజ్యసభలో ప్రకటించారు. దీంతో నిరుద్యోగులు బీజేపీ ప్రభుత్వ పని తీరుపై మండిపడుతున్నారు.
దేశవ్యాప్తంగా రైల్వే శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలంటూ నేషనల్ రైల్వే మజ్దూర్ యూనియన్ ఇటీవల ఢిల్లీలో నిరసన చేపట్టింది. ఖాళీలు భర్తీ చేయకపోవడం వల్ల ప్రస్తుత ఉద్యోగులపై పని భారం పెరుగుతున్నదని, ఒక్కొక్కరు డబుల్ డ్యూటీ చేయాల్సి వస్తున్నదని ఆరోపించారు. ముఖ్యమైన రైల్వే భద్రతా విభాగంలో ఏండ్ల తరబడి ఖాళీల భర్తీ చేపట్టకపోవడంతో ప్రయాణికుల భద్రతపై ప్రభావం చూపుతున్నదని యూనియన్ నాయకులు ఆరోపించారు.
తగ్గుతున్న ఆదాయం
పెద్ద సంఖ్యలో ఖాళీలుండటం వల్ల కొన్ని ముఖ్యమైన పనులను అవుట్ సోర్సింగ్ వారికి అప్పగిస్తుండటంతో రైల్వే శాఖ ఆదాయం కూడా కోల్పోవాల్సి వస్తున్నదని యూనియన్ నాయకులు ఆరోపించారు.