న్యూఢిల్లీ : కొవిడ్ వ్యాక్సినేషన్లో భారత్ మరో మైలురాయిని చేరుకున్నది. బుధవారం వరకు 1,43,15,35,641 డోసులు వేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. దేశవ్యాప్తంగా అర్హత ఉన్న 85శాతం మందికిపైగా ప్రజలు ఒక డోసు టీకా తీసుకున్నారన్నారు. ఈ నెల 31లోగా అర్హులైన వారందరికీ మొదటి డోసు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నది. ఇదిలా ఉండగా బుధవారం భారత్లో 9,100 కొత్త కొవిడ్ కేసులు నమోదయ్యాయి. మంగళవారం నమోదైన కేసుల కంటే 3వేలు ఎక్కువ.
ప్రస్తుతం భారత్లో ఒమిక్రాన్ కేసులు 781కి చేరాయి. ఈ క్రమంలో వందశాతం టీకా లక్ష్యాన్ని సాధించేందుకు కేంద్రం ఇంటింటికీ వ్యాక్సినేషన్ను వేగవంతం చేసింది. వ్యాక్సినేషన్ను మరింత వేగవంతం చేసేందుకు రెండు కొవిడ్ టీకాలతో పాటు యాంటీ వైరల్ డ్రగ్కు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. కోవోవాక్స్, కార్బెవాక్స్, యాంటీ వైరల్ డ్రగ్ మోల్నుపిరావిర్కు అత్యవసర వినియోగ నిపుణుల కమిటీ ఆమోదం తెలిపింది.