న్యూఢిల్లీ: ఫ్రాన్స్ రాయబారి తన భార్యతో కలిసి దీపావళి సందర్భంగా షాపింగ్కు వెళ్లారు. అయితే రద్దీ బజార్లో ఆయన మొబైల్ ఫోన్ చోరీ అయ్యింది. ఫిర్యాదు అందుకున్న పోలీసులు నలుగురు యువకులను అరెస్ట్ చేశారు. ఫ్రెంచ్ రాయబారి మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. (French envoy loses phone) దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. అక్టోబర్ 20న ఫ్రాన్స్ రాయబారి థిర్రీ మాథౌ తన భార్యతో కలిసి ఢిల్లీలోని ప్రసిద్ధ చాందినీ చౌక్ మార్కెట్ను సందర్శించారు. దీపావళి నేపథ్యంలో అక్కడ షాపింగ్ చేశారు.
కాగా, పండగ సందర్భంగా చాందినీ చౌక్ మార్కెట్ జనంతో కిటకిటలాడింది. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలోని జైన్ టెంపుల్ సమీపంలో ఫ్రెంచ్ రాయబారి మాథౌ మొబైల్ ఫోన్ చోరీ అయ్యింది. దీంతో ఫ్రెంచ్ ఎంబీసీ దీని గురించి ఢిల్లీ పోలీసులకు ఆన్లైన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు వెంటనే స్పందించారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్ను పోలీసులు పరిశీలించారు. 20 నుంచి 25 ఏళ్ల వయస్సున్న నలుగురు నిందితులను గుర్తించారు. యమునా నదీ పరివాహక ప్రాంతంలో నివసించే నిందితులను అరెస్ట్ చేశారు. ఫ్రెంచ్ రాయబారి మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకుని ఆయనకు అప్పగించారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.