శ్రీనగర్: జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) పార్టీ అధ్యక్షుడు ఫరూఖ్ అబ్దుల్లా భారతీయ జనతాపార్టీపై విమర్శలు గుప్పించారు. కశ్మీరీలను బీజేపీ ఎప్పుడైనా ఓటు బ్యాంకుగానే చూసిందని ఆయన ఆరోపించారు. ఎన్నికల వేళ కశ్మీరీ ప్రజలపై బీజేపీ హామీల వర్షం కురిపించిందని, కానీ ఆ హామీల్లో ఒక్కదాన్ని నెరవేర్చలేదని ఫరూఖ్ అబ్దుల్లా ఫైరయ్యారు. గతంలో కశ్మీరీ పండిట్లకు, కశ్మీరీ ముస్లింలకు మధ్య బీజేపీ ఎన్నో సమస్యలు సృష్టించిందని అన్నారు.
అంతేగాక, బీజేపీని ఉద్దేశించి మా శత్రువులు ఎప్పుడూ జమ్ముకశ్మీర్లో హిందూ, ముస్లింల మధ్య విధ్వేషాలు రెచ్చగొట్టి లబ్ధి పొందుతారని ఫరూఖ్ అబ్దుల్లా వ్యాఖ్యానించారు. నాయకులు మతాన్ని, రాజకీయాలను వేర్వేరుగా చూడకపోతే దేశం మనుగడ కష్టమని అన్నారు. అదేవిధంగా బీజేపీకి దేశంలో మహిళల ఎదుగుదల ఇష్టంలేదని ఫరూఖ్ అబ్దుల్లా ఆరోపించారు. వాళ్లు మహిళా సాధికారతను కోరుకుంటే.. 300 మంది సభ్యులు ఉండి కూడా పార్లమెంటులో మహిళా హక్కుల చట్టాన్ని ఎందుకు చేయలేదని ప్రశ్నించారు.