న్యూఢిల్లీ: సెన్సార్షిప్ లేకపోవడంతో విచ్చలవిడి అశ్లీలత, అసభ్య పదజాలం వినియోగిస్తున్న ఓటీటీ సంస్థలకు కళ్లెం వేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నది. ఓటీటీల్లో అశ్లీలతకు అడ్డుకట్ట వేసేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రకటించారు. నాగ్పూర్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ… సృజనాత్మకత పేరుతో అసభ్యతను చూపిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని స్పష్టం చేశారు. ఇందుకోసం అవసరమైతే నిబంధనల్లో మార్పుచేర్పులు చేస్తామని తెలిపారు. కేవలం సృజనాత్మకత కోసమే ఓటీటీ సంస్థలకు స్వేచ్ఛ ఉంటుందని పేర్కొన్నారు.