న్యూఢిల్లీ, ఆగస్టు 4: రాజకీయ ప్రత్యర్థులపై కక్ష సాధించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దుర్వినియోగం చేస్తున్నదని విపక్షాలు మండిపడ్డాయి. పార్లమెంట్ ఉభయ సభల్లో నిరసనకు దిగాయి. నిత్యావసరాలపై జీఎస్టీ పెంపు, నిరుద్యోగం, ధరల పెరుగుదలపై కేంద్ర ప్రభుత్వాన్ని తూర్పారబట్టాయి. పార్లమెంటు సమావేశాలు జరుగుతుండగా ప్రతిపక్ష నేత అయిన తనకు ఈడీతో సమన్లు జారీ చేయించడం సభను అవమానించడమేనని రాజ్యసభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ నాయకుడు మల్లిఖార్జున ఖర్గే మండిపడ్డారు. నేషనల్ హెరాల్డ్ కేసులో తనకు ఈడీ సమన్లు జారీ చేసిందని రాజ్యసభకు తెలిపారు.
‘ఈడీ సమన్లు నాకు అందాయి. 12.30 గంటలకు రావాలని ఆదేశాలు జారీ చేశారు. చట్టాన్ని నేను గౌరవిస్తాను. అయితే పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నప్పుడు సమన్లు పంపడం సరైనదేనా? ఈ సమయంలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీల నివాసాలను పోలీసులు ఘెరావ్ చేయడం సమంజసమేనా? కాంగ్రెస్ను భయభ్రాంతులకు గురి చేయడం కోసం వాళ్లు కావాలనే ఇలా చేస్తున్నారు. మేం భయపడేది లేదు’ అని ఖర్గే పేర్కొన్నారు. అయితే ఖర్గే వ్యాఖ్యలను కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఖండించారు. ‘దర్యాప్తు సంస్థల విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోదు. బహుశా వారు (కాంగ్రెస్) అధికారంలో ఉన్నప్పుడు వారి ప్రభుత్వం జోక్యం చేసుకునేదేమో..!’ అని అన్నారు. మరోవైపు, లోక్సభలోనూ కాంగ్రెస్ సభ్యులు వెల్లోకి దూసుకెళ్లి ప్లకార్డులు ప్రదర్శించారు. డీఎంకే, ఎన్సీపీ, సీపీఎం, ఇతర విపక్ష సభ్యులు తమతమస్థానాల్లో నిల్చొని నిరసన తెలిపారు.