న్యూఢిల్లీ, సెప్టెంబర్ 25: దేశాన్ని నాశనం చేస్తున్న బీజేపీని అధికారం నుంచి తరిమేయటమే లక్ష్యంగా పనిచేద్దామని ప్రతిపక్ష పార్టీల నేతలు పిలుపునిచ్చారు. మాజీ ఉప ప్రధాని దేవీలాల్ జయంతిని పురస్కరించుకొని ఇండియన్ నేషనల్ లోక్దళ్ (ఐఎన్ఎల్డీ) ఆధ్వర్యంలో హర్యానాలోని ఫతేహాబాద్లో విపక్ష నేతలు ఆదివారం భారీ ర్యాలీ నిర్వహించారు. ఇందులో ఎన్సీపీ అధినేత శరద్పవార్, బీహార్ సీఎం, జేడీయూ అధినేత నితీశ్ కుమార్, బీహార్ ఉప ముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత తేజస్వీయాదవ్, సీపీఎం నాయకుడు సీతారాం ఏచూరి, శిరోమణి అకాలీదళ్ నేత సుఖ్బీర్సింగ్ బాదల్, శివసేన ఎంపీ అర్వింద్ సావంత్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నితీశ్కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్, వామపక్షాలతోపాటు విపక్షాలన్నీ ఏకమైన 2024 పార్లమెంటు ఎన్నికల్లో పోటీచేస్తే బీజేపీ చిత్తుగా ఓడిపోతుందని అన్నారు. ప్రతి ఒక్కరూ 2024లో కేంద్రంలో ప్రభుత్వ మార్పు కోసం పనిచేయాల్సిన సమయం ఆసన్నమైందని శరద్పవార్ అన్నారు. రైతులు, కార్మికుల కోసం భావసారూప్యతగల పార్టీలన్నీ ఏకం కావాల్సిన అవసరం ఉన్నదని సుఖ్బీర్సింగ్ బాదల్ పేర్కొన్నారు. ఎన్డీయే కూటమిని ఏర్పాటు చేసింది అకాలీదళ్, జేడీయూ, శివసేన పార్టీలేనని, అప్పుడు బీజేపీ చాలా చిన్న పార్టీ అని తెలిపారు.