న్యూఢిల్లీ: మణిపూర్(Manipur)లో ఇద్దరు మహిళల్ని నగ్నంగా ఊరేగించిన అంశంపై పార్లమెంట్(Parliament)లో చర్చించాలని విపక్షాలు పట్టుపడుతున్నాయి. రెండో రోజూ ఇవాళ కూడా ఉదయం ఉభయసభలు వాయిదా పడ్డాయి. అయితే రూల్ 267(Rule 267) కింద సభా కార్యక్రమాలను రద్దు చేసి.. మణిపూర్ అంశం గురించి చర్చించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. సుదీర్ఘ స్థాయిలో చర్చ చేపట్టేందుకు రూల్ 267 కింద వాయిదా తీర్మానం నోటీసులు జారీ చేస్తారు. అయితే ఈ అంశంపై చర్చించేందుకు కేంద్రం అంగీకరించినా.. కేవలం రూల్ 176(Rule 76) కింద ఆ అంశాన్ని చర్చించేందుకు ప్రభుత్వం సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది.
రాజ్యసభలో వాయిదా తీర్మానాల గురించి చైర్మెన్ ప్రకటన చేస్తున్న సమయంలో కొందరు విపక్ష సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. రూల్ 267 కింద చర్చ జరగాలని, రూల్ 176 కాదు అని అన్నారు. పార్లమెంట్కు ప్రధాని వచ్చి సభలో ఆయన మణిపూర్ అంశంపై ప్రకటన చేయాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. రూల్ 267 కింద రాజ్యసభ ఎంపీకి ప్రత్యేక అధికారాలు ఉంటాయి. చైర్మెన్ అనుమతితో ముందుగా నిర్ణయించిన ఎజెండాను రద్దు చేసి తగిన అంశాన్ని చర్చించుకునే వీలు ఉంటుంది. రూల్ 267 కింద ఎవరైనా ఎంపీ వాయిదా తీర్మానం ఇస్తే, అప్పుడు అన్ని సభా కార్యక్రమాలను రద్దు చేసి కేవలం ఆ అంశాన్ని మాత్రమే డిస్కస్ చేయాల్సి ఉంటుంది. కానీ దానికి చైర్మెన్ అనుమతి అవసరం.
1990 నుంచి 2016 వరకు రూల్ 267 కింద 11 సార్లు సభలో చర్చ చేపట్టారు. 2016లో అప్పటి చైర్మెన్ హమిద్ అన్సారీ.. నోట్ల రద్దు అంశంపై డిబేట్కు అవకాశం కల్పించారు. అయితే గత ఆరేళ్లు మాజీ చైర్మెన్ వెంకయ్యనాయుడు తన హయంలో రూల్ 267 కింద ఒక్క నోటీసును కూడా ఆమోదించలేదు. ప్రభుత్వాన్ని నిలదీసి, ఏదైనా స్పందనా కోరాలని భావిస్తే, రూల్ 267 ఒక్కటే మార్గం. క్వశ్చన్ అవర్ సమయంలో ఆ రూల్ కింద ఎంపీలు ప్రభుత్వాన్ని ఏదైనా ప్రశ్న వేసే అవకాశం ఉంటుంది.
కానీ ప్రభుత్వం స్వల్ప స్థాయి చర్చ చేపట్టాలని చూస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. రూల్ 176 కింద చర్చ చేపట్టాలని ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో పార్లమెంట్ రూల్ బుక్ ఇప్పుడు కీలకంగా మారింది. రూల్ 176 కింద కేవలం రెండున్నర గంటలు మాత్రమే చర్చ ఉంటుంది. ఈ రూల్ కింద ఎటువంటి తీర్మానం కానీ ఓటింగ్ కానీ ఉండదు.
ఇవాళ కాంగ్రెస్ నేత మల్లిఖార్జున్ ఖర్గే తన ట్విట్టర్లో ప్రధాని మోదీని ప్రశ్నించారు. పార్లమెంట్ లోపల మణిపూర్ అంశంపై మీరెందుకు ప్రకటన చేయాలని ఆయన అడిగారు. ఒకవేళ మణిపూర్ ఘటన మీకు ఆగ్రహాన్ని తెప్పించి ఉంటే, అప్పుడు మీరెందుకు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలతో ఆ అంశాన్ని పోల్చారని ఆయన ప్రశ్నించారు. మణిపూర్ సీఎంను మీరెందుకు డిస్మిస్ చేయలేదన్నారు. పార్లమెంట్లో మీరు మణిపూర్ పై ప్రకటన చేయాలని, 80 రోజులుగా ఆ రాష్ట్రంలో జరుగుతున్న హింసపై నోరు విప్పాలన్నారు.
.@narendramodi ji,
You did not make a statement inside the Parliament, yesterday.
If you were angry then instead of making false equivalence with Congress governed states, you could have first dismissed your Chief Minster of Manipur.
INDIA expects you to make an elaborate…
— Mallikarjun Kharge (@kharge) July 21, 2023