న్యూఢిల్లీ, జూలై 11: ఢిల్లీలో నిర్మిస్తున్న కొత్త పార్లమెంట్ భవనంపై ఏర్పాటు చేసిన జాతీయ చిహ్నాన్ని ప్రధాని మోదీ సోమవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మోదీ వెంట లోక్సభ స్పీకర్ ఓంబిర్లా, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్, పార్లమెంట్ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ఉన్నారు. అయితే కొత్త పార్లమెంట్ భవనంపై జాతీయ చిహ్నాన్ని మోదీ ఆవిష్కరించడంపై విమర్శలు వస్తున్నాయి. మోదీ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డారని, రాజ్యాంబద్ధమైన అధికార విభజనను అపహాస్యం చేశారని ప్రతిపక్షాలు మండిపడ్డాయి. పార్లమెంట్లో కార్యక్రమం కాబట్టి స్పీకర్ చేతుల మీదుగా ఆవిష్కరణ జరగాల్సి ఉండగా.. దాన్ని తోసిపుచ్చుతూ మోదీ ఆర్భాటం చేశారని విమర్శించాయి. ప్రజాస్వామ్య దేవాలయమైన పార్లమెంట్లో కార్యక్రమానికి ప్రతిపక్షాలను ఆహ్వానించకుండా.. ఓ ప్రైవేటు ఫంక్షన్లా, సొంత పార్టీ కార్యక్రమంలా నిర్వహించారని విమర్శించాయి. ఇదే సమయంలో ఈ కార్యక్రమానికి రాజ్యసభ చైర్మన్గా ఉండే ఉపరాష్ట్రపతి కూడా హాజరుకాకపోవడం గమనార్హం.
పార్లమెంట్ మోదీ ఒక్కరిదే కాదు..
రాజ్యాంగం పార్లమెంట్, ప్రభుత్వం, న్యాయవ్యవస్థ మధ్య అధికార విభజన చేసిందని, ప్రభుత్వాధినేతగా ఉన్న ప్రధాని పార్లమెంట్ భవనంపై జాతీయ చిహ్నాన్ని ఆవిష్కరించకూడదని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ పేర్కొన్నారు. ప్రధాని మోదీ రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘించారని విమర్శించారు. సీపీఎం పొలిట్బ్యూరో కూడా మోదీ చర్య రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నదని అభిప్రాయపడింది. ఈ కార్యక్రమానికి ప్రభుత్వం ప్రతిపక్షాలను ఎందుకు దూరంగా పెట్టిందని ఎన్సీపీ నేత, రాజ్యసభ మాజీ ఎంపీ మజీద్ మెమన్ ప్రశ్నించారు. పార్లమెంట్ అంటే ప్రధాని ఒక్కరిదే కాదని, ప్రతిపక్షాలు కూడా అందులో భాగమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ప్రతిపక్ష నేతలను ఆహ్వానించకపోవడం ప్రజాస్వామ్య విరుద్ధమని విమర్శించారు. ఆవిష్కరణ సందర్భంగా మతపరమైన కార్యక్రమం నిర్వహించడంపై సీపీఎం అభ్యంతరం వ్యక్తం చేసింది. పార్లమెంట్ ప్రతి ఒక్కరిదని, అక్కడ కార్యక్రమాన్ని ప్రైవేటుగా ఎలా నిర్వహిస్తారని సీపీఐ ప్రధాన కార్యదర్శి డీ రాజా ప్రశ్నించారు.
జాతీయ చిహ్నం ప్రత్యేకతలు
కాంస్యంతో చేసిన ఈ జాతీయ చిహ్నం బరు వు 9500 కిలోలు. ఎత్తు 6.5 మీటర్లు. చిహ్నం బరువును మోయగలిగేలా 6,500 కేజీల స్టీల్తో ఓ సపోర్టింగ్ కట్టడాన్ని నిర్మించారు.