పుదుచ్చేరి: పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతున్నారని ప్రతిపక్ష నేత ఆర్. శివ ఆరోపించారు. రాజ్భవన్ రాజకీయాలకు వేదికగా మారిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామి తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బీహార్ సీఎం నితీశ్ కుమార్లా ఎన్డీఏ నుంచి బయటకు రావాలని సూచించారు. పుదుచ్చేరి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేడు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ప్రతిపక్ష డీఎంకే, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నల్లఅంగీలు ధరించి సమావేశాలకు హాజరయ్యారు. లెఫ్టినెట్ గవర్నర్ తమిళిసైకి ప్రసంగిస్తుండగా.. సభనుంచి వాకౌట్ చేశారు.
అనంతరం ప్రతిపక్ష నేత ఆర్. శివ మీడియాతో మాట్లాడారు. ఎల్జీ తమిళిసై పలుసామార్లు ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులను కలిశారు. అయితే ఆమె కేవలం రాజకీయ కారణాలతోనే దేశ రాజధానికి వెళ్లారని ఇప్పుడు స్పష్టమవుతున్నదని విమర్శించారు. సీఎం రంగస్వామి ప్రధానిని కలిశారు. అయితే కేంద్ర నుంచి ఎన్ని నిధులు తీసుకురాగలిగారని ప్రశ్నించారు. ఇప్పటికీ పుదుచ్చేరిలో ఎలాంటి అభివృద్ధి జరుగలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు.