చెన్నై: ఉత్తర, దక్షిణ భాషా వివాదాల నేపథ్యంలో తమిళనాడులో ఘోరం జరిగింది. కేంద్రం దేశంపై హిందీని బలవంతంగా రుద్దేందుకు చేస్తున్న ప్రయత్నాలతో కలత చెందిన ఓ వృద్ధుడు శనివారం ఆత్మాహుతికి పాల్పడ్డాడు. తమిళనాడులోని సేలం జిల్లాలో 85 ఏండ్ల తంగవేల్ అనే వృద్ధుడు డీఎంకే కార్యాలయం ముందే పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. మెట్టూరు సమీపంలోని తలయూరులో ఈ ఘటన చోటుచేసుకొన్నది. మృతుడు డీఎంకే పార్టీ వ్యవసాయ సంఘం మాజీ నాయకుడని, ఇటీవలి కాలం వరకు డీఎంకే క్రియాశీల సభ్యుడని తెలుస్తున్నది. ఉదయం సుమారు 11 గంటల ప్రాంతంలో తంగవేల్ ఒంటి మీద పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. ‘మోదీ సర్కార్, కేంద్ర సర్కార్.. మాకు హిందీ వద్దు. మా మాతృభాష తమిళం. హిందీ విదూషకుల భాష. హిందీని రుద్దితే మా విద్యార్థుల జీవితాలు నాశనం అవుతాయి. హిందీ తొలగించాల్సిందే’ అని రాసిన బ్యానర్ ఆయన తనతో తెచ్చాడు. నిప్పంటించుకున్న కొద్దిసేపటికే కాలిన గాయాలతో వృద్ధుడు ప్రాణాలు వదిలాడు.