న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్లో ఉగ్రవాద కార్యకలాపాలను పెంచేందుకు పాకిస్థాన్ ప్రణాళికలు రచిస్తున్న క్రమంలో అందుకు కౌంటర్గా భారత సైన్యం కీలక నిర్ణయం తీసుకొన్నది. ఉగ్రవాదుల వేటకు ‘ఆపరేషన్ సర్వశక్తి’ చేపట్టాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా పీర్ పంజల్ పర్వత శ్రేణులతోపాటు కేంద్ర పాలిత ప్రాంతమంతా ఉగ్రవాదుల ఆచూకీ కోసం భద్రతా బలగాలు విస్తృత గాలింపు చర్యలు చేపడతాయి. జమ్ముకశ్మీర్ పోలీసులతో పాటు సీఆర్పీఎఫ్, ప్రత్యేక ఆపరేషన్ల దళం, ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు సైన్యానికి సహకరిస్తాయని అధికారులు తెలిపారు. పీర్ పంజల్ పర్వత శ్రేణుల్లో ఉగ్రమూకలు చెలరేగుతున్న విషయం తెలిసిందే.