ఆపరేషన్ గంగా ఇంకా ముగియలేదని కేంద్ర ప్రభుత్వం గురువారం ప్రకటించింది. ఇప్పటికీ ఉక్రెయిన్లో తరలింపు కోసం 15 నుంచి 20 మంది భారతీయులు వేచి చూస్తున్నారని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ తెలిపారు. వీరందరికీ తగిన సహాయం అందిస్తూనే వున్నామని పేర్కొంది. ఇప్పటికీ కొందరు ఖేర్సన్లో వున్నారని, ఎవరైతే భారత్కు రావాలని అనుకుంటున్నారో వారందరికీ సహాయం చేయడానికి తాము సిద్ధమని, ఆపరేషన్ గంగా ఇంకా ముగియలేదని అన్నారు.
ఇప్పటి వరకూ 22,500 మంది భారతీయులను తరలించామని, ఇంకా కొంతమంది ఐసోలేటెడ్ ప్రాంతంలో ఉన్నారని బాగ్చీ పేర్కొన్నారు. మరికొందరు భారత్కు రావడానికి సుముఖత వ్యక్తం చేయడం లేదన్నారు. అక్కడ వున్న వారితో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ టచ్లో వుందని వెల్లడించారు. భారత్కు రావడానికి 15 నుంచి 20 మంది భారతీయులు రెడీగా వున్నారని, మిగతా వారు రావడానికి సిద్దంగా లేరని బాగ్చీ పేర్కొన్నారు.