(స్పెషల్ టాస్క్ బ్యూరో)
హైదరాబాద్, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వ శాఖల్లో, ఏజెన్సీల్లో ఐపీఎస్ల కొరత ఉన్నదని, డిప్యుటేషన్పై అధికారులను పంపించాలంటూ గత కొన్ని రోజులుగా కేంద్రంలోని మోదీ సర్కారు రాష్ర్టాలపై ఒత్తిడి తీసుకొస్తున్నది. ఇది సమాఖ్యస్ఫూర్తికి విరుద్ధమని, తమ దగ్గర కూడా అధికారుల కొరత ఉన్నదని విపక్షపాలిత రాష్ర్టాలు ఎంతచెప్పినా కేంద్రం పట్టించుకోవట్లేదు. పైగా.. కేంద్రంలో డిప్యుటేషన్పై పనిచేయని రాష్ట్ర క్యాడర్ ఐపీఎస్లకు భవిష్యత్తులో కేంద్రంలో పనిచేసే అవకాశం ఇవ్వబోమని హెచ్చరించింది. అంతేనా, వివిధ రాష్ర్టాల్లో పనిచేస్తున్న సీనియర్ ఐపీఎస్లకు పదోన్నతి ఇవ్వాలన్నా, బదిలీ చేయాలన్నా.. ముందుగా తమ అనుమతి తీసుకోవాలని కొత్త కొర్రీలు పెట్టింది. నిజంగా కేంద్ర శాఖల్లో అధికారుల కొరత ఉన్నట్లయితే, ఏయే రాష్ర్టాల్లో అధికారులు అదనంగా ఉన్నారో పరిశీలించి వారిని డిప్యుటేషన్పై కేంద్రం రప్పించుకోవాలి. కానీ, అలా జరుగట్లేదు. బీజేపీపాలిత ఉత్తరప్రదేశ్లో డైరెక్టర్ జనరల్ (డీజీ), అడిషనల్ డైరెక్టర్ జనరల్ ర్యాంక్ (ఏడీజీ) స్థాయి అధికారులు 78 మంది ఉన్నారు. నిజానికి ఆ రాష్ర్టానికి కేటాయించిన పరిమితి 28 మాత్రమే. అయితే, డీజీ (స్పెషల్ ఎంక్వైరీ), డీజీ (పవర్ కార్పొరేషన్), ఏడీజీ (టెక్నికల్ సర్వీస్), ఏడీజీ (టెలికం).. ఇలా కొత్త హోదాలను సృష్టించి దాదాపు 175 శాతం మందికి అదనంగా నియామక ఉత్తర్వులు జారీచేశారు.
విపక్ష రాష్ర్టాలే టార్గెట్
కేంద్ర ప్రభుత్వ నియంత్రణలోని 17 సెంట్రల్ పోలీస్ ఆర్గనైజేషన్లలో డీజీ, ఏడీజీ స్థాయిలోని మొత్తం పోస్టుల్లో రెండు మాత్రమే ఇప్పుడు ఖాళీగా ఉన్నాయి. ఈ మేరకు హోంమంత్రిత్వశాఖ, బ్యూరో ఆఫ్ పోలీస్ రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ గణాంకాలు చెబుతున్నాయి. అయినప్పటికీ, తమ శాఖల్లో ఉన్నతాధికారుల పోస్టులు ఖాళీగా ఉన్నాయంటూ కేంద్రం గగ్గోలు పెడుతుండటంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఉన్నతాధికారులు అదనంగా ఉన్న యూపీ వంటి రాష్ర్టాలను వదిలేసి, అధికారుల కొరతతో సతమతమవుతున్న విపక్ష రాష్ట్ర ప్రభుత్వాలపై కేంద్రం ఒత్తిడి తీసుకురావడం ఉద్దేశపూర్వక కుట్రేనని నిపుణులు మండిపడుతున్నారు.