గౌహతి: కోవిడ్ పాజిటివ్ కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో.. అస్సాం సీఎం హేమంత బిశ్వ శర్మ కొత్త నిబంధనలను ప్రకటించారు. రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తి అయిన వారికి మాత్రమే.. హోటళ్లు, రెస్టారెంట్లు, గవర్నమెంట్ ఆఫీసులు, షాపింగ్ మాల్స్, మల్టీప్లెక్సుల్లోకి అనుమతి కల్పించనున్నట్లు ఆయన వెల్లడించారు. జనవరి 8వ తేదీ నుంచి కర్ఫ్యూను రాత్రి పూట 10 నుంచి ఉదయం 6 వరకు అమలు చేయనున్నట్లు ఆయన చెప్పారు. కామరూప్ జిల్లాలో 8వ తరగతి వరకు, ఇతర జిల్లాల్లో అయిదవ తరగతి వరకు స్కూళ్లను మూసివేస్తున్నట్లు సీఎం తెలిపారు. జవనరి 30వ తేదీ వరకు భౌతికంగా క్లాసులు నిర్వహించరాదు అని ఆయన ఆదేశించారు. పూర్తిగా వ్యాక్సిన్ తీసుకున్న వారితో మాత్రమే రెస్టారెంట్లు వంద శాతం సామర్ధ్యంతో తెరుచుకోనున్నట్ల సీఎం వెల్లడించారు.
వ్యాక్సిన్లు కావాలి..
పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఇవాళ మీడియాతో మాట్లాడారు. కొత్తగా 43 మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్లను, 16 మదర్, చైల్డ్ సెంటర్లను నిర్మించినట్లు ఆమె తెలిపారు. జీరో వేస్టేజ్ రికార్డుతో వ్యాక్సినేషన్ ప్రక్రియను పూర్తి చేసినట్లు ఆమె వెల్లడించారు. అయితే ఇంకా ఎక్కువ సంఖ్యలో వ్యాక్సిన్లు కావాలని, ఎందుకంటే రాష్ట్రంలో 40 శాతం జనాభా ఇంకా టీకాలు వేసుకోలేదన్నారు.
వ్యాక్సిన్ సర్టిఫికేట్ చూపాల్సిందే..
వ్యాక్సిన్ సర్టిఫికేట్ తప్పనిసరి చేస్తూ కర్నాటక ప్రభుత్వ కూడా ఆదేశాలు జారీ చేసింది. పబ్లిక్ ప్రదేశాలకు ఎంటర్ అయినా, మార్కెట్లు, మాల్స్, పబ్బులు, బార్లు, రెస్టారెంట్లు ఎక్కడికి వెళ్లినా వ్యాక్సిన్ సర్టిఫికేట్ చూపించాలని కర్నాటక ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ కే సుధార్ తెలిపారు.