న్యూఢిల్లీ/బెంగళూరు, మే 11: దేశంలో కరోనా టీకాలకు తీవ్ర కొరత నెలకొన్న నేపథ్యంలో పలు రాష్ట్ర ప్రభుత్వాలు విదేశాల నుంచి టీకాలను కొనుగోలు చేయటానికి ప్రయత్నాలు ప్రారంభించాయి. ఈ మేరకు అంతర్జాతీయ స్థాయిలో (గ్లోబల్) టెండర్లను పిలువాలని ఉత్తర్ప్రదేశ్, మహారాష్ట్ర ఇప్పటికే నిర్ణయించగా.. తాజాగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రప్రభుత్వాలు అదే నిర్ణయం తీసుకున్నాయి. టీకాలకు పెరిగిన డిమాండ్ను తట్టుకోవటానికి, 18-44 ఏండ్ల వయసు వారికి కూడా టీకాలు వేయటానికి రెండు కోట్ల వ్యాక్సిన్లను విదేశీ కంపెనీల నుంచి కొనుగోలు చేయాలని నిర్ణయించామని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి, ఆ రాష్ట్ర కొవిడ్ టాస్క్ఫోర్స్ అధిపతి సీఎన్ అశ్వత్ నారాయణ్ మంగళవారం తెలిపారు. ఈ మేరకు వారంరోజుల్లో గ్లోబల్ టెండర్ ప్రక్రియను పూర్తి చేయాలనుకుంటున్నట్లు వెల్లడించారు. రాష్ర్టాలు టీకాల సేకరణకు విదేశీ కంపెనీలపై ఆధారపడే పరిస్థితులను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కల్పిస్తుందని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా మంగళవారం ఆరోపించారు. మరోవైపు, ఒకట్రెండు రోజుల్లో గ్లోబల్ టెండర్ను వెలువరిస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది.
నాలుగుకోట్ల డోసులకు యూపీ ఆర్డర్
ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వం నాలుగు కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసుల కోసం ఈ నెలారంభంలో గ్లోబల్ ఈ-టెండర్లను పిలిచింది. రష్యా తయారుచేసిన స్పుత్నిక్-వీతోపాటు మోడర్నా, జాన్సన్ అండ్ జాన్సన్ టీకాలను పెద్ద మొత్తంలో కొంటామని యూపీ ఉన్నతాధికారులు వెల్లడించారు. ఒడిశా కూడా ఇదే బాటలో ఉంది.
ఆ రెండు కంపెనీలపైనే ఆధారపడే పరిస్థితి లేదు
సీరం ఇన్స్టిట్యూట్.. కొవిషీల్డ్ను, భారత్ బయోటెక్.. కొవాగ్జిన్ను తయారుచేస్తున్న విషయం తెలిసిందే. ఈ రెండు కంపెనీల సగం టీకాలను కేంద్రం సేకరించి రాష్ర్టాలకు పంపిస్తున్నది. మిగిలిన సగం టీకాలను ఆయా కంపెనీలు రాష్ట్రప్రభుత్వాలకుగానీ, ప్రైవేట్ మార్కెట్లోగానీ విక్రయించుకోవటానికి కేంద్రం అనుమతినిచ్చింది. అయితే, మన దేశ జనాభాతో పోల్చితే.. ప్రస్తుతం దేశంలో ఉత్పత్తి అవుతున్న టీకాలు ఎంతమాత్రం సరిపోయే పరిస్థితి లేదు. ఈ రెండు కంపెనీలపైనే ఆధారపడితే దేశ జనాభాకు రెండు డోసుల టీకా వేయటానికి రెండేండ్లు పడుతుందని అంచనా. దీంతో విదేశీ కంపెనీల నుంచి టీకాలను కొనుగోలు చేయటానికి రాష్ర్టాలు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి.