న్యూఢిల్లీ: పిల్లలకు కరోనా టీకాపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. 15- 18 సంవత్సరాల వయస్సు వారికి కోవాగ్జిన్ టీకా మాత్రమే వేయనున్నారు. ఈ వయసు పిల్లలకు వ్యాక్సినేషన్ జనవరి 3 నుంచి ప్రారంభమవుతుంది. అలాగే కరోనా పోరులో భాగమైన ఆరోగ్య కార్మికులు, ఫ్రంట్లైన్ కార్మికులు, 60 ఏండ్లు పైబడి అనారోగ్య సమస్యలున్న వారికి ప్రికాషనరీ డోసు (బూస్టర్ లేదా మూడో డోసు) ఇస్తారు. జనవరి 10 నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలవుతుంది. అయితే రెండో డోసు, బూస్టర్ డోసు మధ్య 9 నెలలు లేదా 39 వారాల గ్యాప్ ఉండాలని కేంద్రం తెలిపింది. 60 ఏండ్లు పైబడి, అనారోగ్య సమస్యలున్న వారికి డాక్టర్ సూచనపై మాత్రమే మూడో డోసు ఇస్తామని పేర్కొంది. ఈ మేరకు కరోనా వ్యాక్సినేషన్కు సంబంధించిన అధికారిక మార్గదర్శకాలను సోమవారం విడుదల చేసింది.
కాగా, 12 ఏండ్లు పైబడిన పిల్లలకు దేశీయంగా అభివృద్ధి చేసిన భారత్ బయోటెక్ కోవాగ్జిన్ అత్యవసర వినియోగానికి డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) కొన్ని షరతులతో శనివారం అనుమతి ఇచ్చింది. జైడాస్ కాడిలా సూది రహిత కోవిడ్-19 వ్యాక్సిన్ ZyCoV-D తర్వాత 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారిలో ఉపయోగం కోసం డీసీజీఐ ఆమోదం పొందిన రెండవ వ్యాక్సిన్ ఇది.