న్యూఢిల్లీ: ఉల్లిగడ్డల ధరలు తక్కువగానే ఉన్నాయని, ప్రస్తుతం ఉల్లి ధరలు మరీ ఎక్కువ స్థాయిలో ఏమీ లేవని కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ కార్యదర్శి సుధాన్షు పాండే తెలిపారు. ఉల్లి ధరలపై అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నట్లు ఆయన చెప్పారు. ప్రస్తుతం ఉల్లి ఎగుమతులపై ఎటువంటి నిషేధం అవసరం లేదన్నారు. రాష్ట్రాలకు కిలో 26 రూపాయలకు ఉల్లిగడ్డలను ఇస్తున్నట్లు సుధాన్షు తెలిపారు. దేశవ్యాప్తంగా ఆవ నూనె ఉత్పత్తి 10 లక్షల మెట్రిక్ టన్నులు పెరిగినట్లు ఆయన చెప్పారు. అయితే వచ్చే ఏడాది ఫిబ్రవరిలోగా ఆవ నూనె ధరలు తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నట్లు సుధాన్షు వెల్లడించారు.
ఇండోనేషియా, మలేషియాలో కూలీల సమస్యల వల్ల .. అంతర్జాతీయ మార్కెట్లో పామాయిల్ ధరలు పెరుగుతున్నట్లు ఆయన చెప్పారు. కానీ ఇండియాలో మాత్రం పామాయిల్ ధరలు తగ్గుతున్నట్లు ఆహార శాఖ కార్యదర్శి స్పష్టం చేశారు. ఇతర దేశాలతో పోలిస్తే ఇండియాలో నిత్యావసర ధరల నియంత్రణ వేగంగా జరుగుతున్నదని, కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వాల చొరవతో ఇది సాధ్యమవుతున్నట్లు సుధాన్షు చెప్పారు. నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించి, వినియోగదారులకు రిలీఫ్ తీసుకువచ్చేందుకు కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ నిత్యం ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.