శాన్ఫ్రాన్సిస్కో, డిసెంబర్ 8: ప్రముఖ సోషల్మీడియా సంస్థ ‘వాట్సాప్’, తన వినియోగదారుల గోప్యతను పటిష్టపరుస్తూ మరిన్ని చర్యలు చేపట్టింది. ఒకసారి విన్న తర్వాత.. కనుమరుగయ్యే ‘డిజప్పియిరింగ్ వాయిస్ మెసెజ్’లను ప్రవేశపెట్టబోతున్నట్టు వాట్సాప్ మాతృసంస్థ ‘మెటా’ తాజాగా ప్రకటించింది. ‘వన్ టైమ్’ ఆప్షన్ కింద యూజర్లు పంపే వాయిస్ మెసెజ్లు.. వాటిని ఒకసారి విన్న తర్వాత అదృశ్యమవుతాయని కంపెనీ తెలిపింది. వాట్సాప్ 2021లో ‘వ్యూ వన్స్ ఆప్షన్’ అనేదాన్ని తీసుకొచ్చింది. ఈ ఆప్షన్ను ఎంపికచేసి యూజర్లు.. ఫొటోలు, వీడియోలు పంపినట్టయితే, వాటిని అందుకున్న వ్యక్తి ఒక్కసారి మాత్రమే ఆ సందేశాల్ని చూడగలడు. ఆ తర్వాత కనుమరుగవుతాయి. తాజాగా వాయిస్ మెసేజ్లకు కూడా దానిని వర్తింపజేస్తున్నట్టు కంపెనీ వర్గాలు తెలిపాయి. ఈ విధానం యూజర్ల గోప్యతను మరింత కట్టుదిట్టం చేస్తుందని పేర్కొన్నది. త్వరలో ఇది ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్ యూజర్లకు అందుబాటులోకి రానున్నట్టు తెలిపింది.