వారణాసి: అన్నూమిన్నూ కానకుండా ఓ యువజంట చేసిన మతిలేని చేష్టలు ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకున్నాయి. మరో వ్యక్తిని తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలయ్యేలా చేశాయి. కానీ నిందితులు మాత్రం తమ బైకు తీసుకుని ఘటనా ప్రాంతం నుంచి పారిపోయారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసి సిటీ పరిధిలో ఆదివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆదివారం రాత్రి వారణాసి సిటీ శివపూర్ ఏరియాలోగల గంజారి ఫ్లైఓవర్పై ఓ యువజంట ప్రమాదకర స్టంట్స్ చేసింది. స్టంట్స్ చేస్తూ మొబైల్ఫోన్లో వీడియోలు తీసుకుంది. ఈ క్రమంలో బైకు అదుపుతప్పి కింద వెళ్తున్న కారుపై పడింది. దాంతో కారులో ఉన్న రైల్వే ఇంజినీర్ సర్వేశ్ (25) తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అతని స్నేహితుడు ఆదిత్య వర్మ తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
కాగా, ఈ ప్రమాదంలో బైకుపై స్టంట్స్ చేసిన యువజంటకు మాత్రం ఎలాంటి గాయాలు కాలేదు. అందుకే కారులో ఇరుక్కున్న తమ బైకును బయటికి తీయగానే స్థానికుల కన్నుగప్పి అక్కడి నుంచి పరారయ్యారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకుని క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపించారు. ఘటనా ప్రాంతంలో దొరికిన బైకు ఛాసిస్ నంబర్ ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు గాలింపు చేపట్టారు.