న్యూఢిల్లీ, నవంబర్ 12: భారతదేశంలో 40 లక్షల మెడికల్ ల్యాబ్ రిపోర్టులను పరిశీలించగా.. ఆందోళనకర విషయం బయటపడింది. ప్రతి ఇద్దరు భారతీయుల్లో ఒకరికి రక్తంలో అధిక చక్కెర స్థాయిలు ఉన్నట్టు తేలింది. దేశంలో నిశ్శబ్దంగా విస్తరిస్తున్న డయాబెటిస్ మహమ్మారిని ఇది సూచిస్తున్నది. భారత్లో టైప్-2 డయాబెటిస్, ప్రీ-డయాబెటిస్ కేసుల పెరుగుదల ఆందోళనకరంగా ఉందని అధ్యయనం పేర్కొన్నది. 2021 నుంచి 2025 మధ్య నిర్వహించిన 40 లక్షల మెడికల్ ల్యాబ్ నివేదికలను పరిశోధకులు విశ్లేషించారు.
దాదాపు ప్రతి ఇద్దరి HbA1c (షుగర్ టెస్ట్) పరీక్ష ఫలితాల్లో ఒకటి డయాబెటిక్ పరిధిలోనే ఉంది. కనీసం నలుగురిలో ఒకరు ప్రీ-డయాబెటిస్ కలిగి ఉన్నారు. గత మూడు నెలలుగా రక్తంలో చక్కెర స్థాయిల సగటును ‘HbA1c టెస్ట్’తో తెలుసుకోవచ్చు. నిపుణుల అభిప్రాయం ప్రకారం HbA1c స్థాయి సాధారణంగా 5.7 శాతం కంటే తక్కువగా ఉండాలి. 6.5 దాటితే డయాబెటిస్ ఉందని అర్థం. పట్టణ, గ్రామీణ జనాభా.. రెండింటిలోనూ గ్లూకోజ్ స్థాయిలు పెరిగినట్టు అధ్యయనం తెలిపింది.