న్యూఢిల్లీ, ఆగస్టు 7: దేశంలో దాదాపు 85 శాతం పిల్లలు ఆన్లైన్ వేధింపులకు గురైనట్లు తాజా సర్వేలో వెల్లడైంది. మెక్ఫీ సైబర్ బుల్లీయింగ్ నివేదికలో ఈ విషయం తేలింది. ప్రపంచవ్యాప్తంగా 10 దేశాల్లో 11,687 మంది తల్లిదండ్రులు, వారి పిల్లలపై జూన్ 15 నుంచి జూలై 5 మధ్య ఈ సర్వే నిర్వహించారు. ప్రపంచంలోనే పిల్లలపై ఆన్లైన్ వేధింపులు భారత్లోనే అధికంగా చోటుచేసుకుంటున్నట్టు నివేదికలో తేలింది. ప్రతి ముగ్గురు పిల్లల్లో ఒకరు సైబర్ బుల్లీయింగ్కు గురవుతున్నట్టు వెల్లడైంది. ప్రతి సోషల్మీడియా, మెసేజింగ్ వేదికల్లో ఈ వేధింపులు జరుగుతున్నట్టు మెక్ఫీ చీఫ్ ప్రోడక్ట్ ఆఫీసర్ గగన్సింగ్ తెలిపారు. ఈ వేధింపులు తాళలేక సోషల్ మీడియా ఖాతాలు డిలీట్ చేసినట్టు ప్రతి ఐదుగురులో ముగ్గురు తెలిపారని ఆయన వెల్లడించారు. రేసిజం, ట్రోలింగ్, వ్యక్తిగత దాడులు, లైంగిక వేధింపులు తదితరాలు ఎక్కువగా పిల్లలు ఎదుర్కొంటున్నట్టు వివరించారు.