ముంబై: మహిళా దినోత్సవం (Women’s Day) రోజున కొందరు మహిళా ప్రయాణికులు నల్ల రిబ్బన్లు ధరించారు. రైల్వే అధికారుల తీరుపై నిరసన వ్యక్తం చేశారు. మహిళా ప్రయాణికుల సమస్యలను పరిష్కరించకపోవడంపై మండిపడ్డారు. బీజేపీ పాలిత మహారాష్ట్రలో ఈ సంఘటన జరిగింది. థానే జిల్లాలోని డోంబివిలి రైల్వే స్టేషన్లో కొందరు మహిళా ప్రయాణికులు బుధవారం నల్ల రిబ్బన్లు ధరించారు. నిత్యం లోకల్ రైళ్లలో ప్రయాణించే మహిళలకు మెరుగైన సౌకర్యాలు కల్పించకపోవడంపై మహిళా దినోత్సవం రోజున వినూత్నంగా నిరసన తెలిపారు. కర్జాత్, కసరా, దక్షిణ ముంబైలోని సీఎస్ఎంటీ మధ్య లోకల్ రైళ్లలో ప్రయాణించే మహిళలు చాలా కాలంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు వారు తెలిపారు.
కాగా, థానే, కర్జాత్, కసర వంటి సుదూర స్టేషన్ల మధ్య షటిల్ సర్వీసులు నడపాలన్న తమ డిమాండ్ను రైల్వే అధికారులు పట్టించుకోలేదని ఉపనాగరి రైల్వే ప్రవాసీ మహాసంఘ్ అధ్యక్షురాలు లతా అర్గాడే విమర్శించారు. సబర్బన్ రైళ్లలో మహిళలకు కేటాయించిన కోచ్ల సంఖ్య 20 ఏళ్ల కిందట ఉన్నట్లుగానే ఉన్నదని తెలిపారు. మహిళా ప్రయాణికుల సంఖ్య చాలా రెట్లు పెరిగినప్పటికీ ఆ మేరకు కోచ్ల సంఖ్యను పెంచలేదని ఆరోపించారు.
అలాగే బిచ్చగాళ్ళు, మాదకద్రవ్యాల బానిసలు, సంఘవ్యతిరేకుల నుంచి రైళ్లలో ప్రయాణించే మహిళల భద్రతకు ముప్పు ఉందని లతా ఆందోళన వ్యక్తం చేశారు. మహిళా ప్రయాణికుల సమస్యలపై అధికారులకు అనేక విన్నపాలు ఇచ్చినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందని విమర్శించారు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఈ డిమాండ్లపై అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు. అందుకే మహిళా దినోత్సవం సందర్భంగా నల్ల రిబ్బన్లు ధరించి తమ నిరసన తెలియజేసినట్లు ఆమె వెల్లడించారు.