న్యూఢిల్లీ, ఫిబ్రవరి 2: అదానీ సంస్థల్లోని అవకతవకలపై గురువారం పార్లమెంట్ ఉభయ సభలు అట్టుడికాయి. మునుపెన్నడూ లేనివిధంగా స్టాక్ మార్కెట్ క్రాష్ కావడానికి కారణమైన అదాని గ్రూప్ మోసాలపై చర్చకు విపక్షాలు మూకుమ్మడిగా పట్టుపట్టాయి. హిండెన్బర్గ్ రిసెర్చ్ ఇచ్చిన నివేదికపై చర్చించాల్సిందేనంటూ డిమాండ్ చేశాయి. సభ్యుల నినాదాలతో సభలో గందరగోళ వాతావరణం నెలకొన్నది. విపక్ష సభ్యులు ఎంతకూ దిగిరాకపోవడంతో ఉభయ సభలు శుక్రవారానికి వాయిదా పడ్డాయి. గురువారం ఉదయం 11 గంటలకు లోక్సభ ప్రారంభమైంది.
జాంబియా నుంచి వచ్చిన పార్లమెంటరీ ప్రతినిధి బృందానికి స్వాగతం పలికిన స్పీకర్ ఓం బిర్లా ఆ తర్వాత ప్రశ్నోత్తరాల సమయాన్ని ప్రారంభించారు. దీంతో ప్రతిపక్ష సభ్యులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ వెల్లోకి దూసుకెళ్లారు. హిండెన్బర్గ్ నివేదిక గురించి చర్చించాలని పట్టుపట్టారు. ఈ బడ్జెట్ సమావేశాల్లో కేంద్రప్రభుత్వంపై అనుసరించాల్సిన ఉమ్మడి వ్యూహం కోసం ఉదయమే ప్రతిపక్షపార్టీలు సమావేశమయ్యాయి. రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే చాంబర్లో జరిగిన ఈ సమావేశానికి తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, సమాజ్వాదీ పార్టీ, డీఎంకే, జనతాదళ్ యునైటెడ్, వామపక్షాలతో సహా డజన్కు పైగా పార్టీలు హాజరయ్యాయి. అందులో భాగంగానే కాంగ్రెస్తో పాటు మరికొన్ని పార్టీలు వాయిదా తీర్మానాలు ఇచ్చాయి. ఇందుకు స్పీకర్ అంగీకరించలేదు.
ప్రశ్నోత్తరాల సమయం చాలా ముఖ్యమైనదని, సభ్యులు దీనికి అంతరాయం కలిగించవద్దంటూ కోరారు. అయినా ప్రతిపక్ష ఎంపీలు వెనక్కి తగ్గలేదు. దీంతో సభను మధ్యాహ్నం 2 గంటలకు స్పీకర్ వాయిదా వేశారు. లోక్సభలో లాగే రాజ్యసభలో కూడా ఇలాంటి పరిస్థితే తలెత్తింది. చైర్మన్ జగదీప్ ధన్కడ్ సభను పారంభించగానే విపక్షాలు ఆందోళనకు దిగాయి. చేసేదేమీ లేక సభను మధ్యాహ్నం 2 గంటలకు చైర్మన్ వాయిదా వేశారు. మధ్యాహ్నం ఉభయ సభలు తిరిగి ప్రారంభమయ్యాక కూడా పరిస్థితిలో ఏ మార్పు రాలేదు. దీంతో ఇటు స్పీకర్, అటు చైర్మన్ సభలను శుక్రవారానికి వాయిదా వేశారు.
అదానీ గ్రూప్పై హిండెన్బర్గ్ ఇచ్చిన నివేదికపై దర్యాప్తునకు డిమాండ్ చేసిన విపక్షాలు, సభలు వాయిదా పడిన తర్వాత మీడియా సమావేశం నిర్వహించాయి. బీఆర్ఎస్ నేతలు, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో సహా ప్రతిపక్ష పార్టీల నేతలు ఇందులో పాల్గొన్నారు. ‘ఈ వ్యవహారంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ లేదా సీజేఐ ఆధ్వర్యంలోని కమిటీతో దర్యాప్తు జరిపించాలి. ఎల్ఐసీతో పాటు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో కోట్లాది మంది పెట్టుబడులున్నాయి. వారి సొమ్ము ఇప్పుడు ప్రమాదంలో పడింది’ అని ప్రతిపక్ష నేతలు ఆరోపించారు.
తక్షణమే గౌతమ్ అదానీ పాస్పోర్ట్ను జప్తు చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్సింగ్ డిమాండ్ చేశారు. ఏఎన్ఐతో ఆయన మాట్లాడుతూ ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీకి, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కు, సీబీఐకి లేఖ రాశానని చెప్పారు. లేదంటే అతను కూడా దేశం విడిచి పారిపోతే ఎంతో మంది పెట్టుబడిదారులతో పాటు కోట్లాది మంది ప్రజలు తీవ్రంగా నష్టపోతారని తెలిపారు.