శ్రీనగర్: రంజాన్ (ఈద్-ఉల్-ఫితర్) సందర్భంగా భారత్, పాకిస్థాన్ ఆర్మీ అధికారులు స్వీట్లు ఇచ్చిపుచ్చుకున్నారు. జమ్ముకశ్మీర్ సరిహద్దులోని పూంచ్-రావ్కోట్ నియంత్రణ రేఖ వద్ద, మెన్ధర్-హాట్స్ప్రింగ్ చెక్పోస్టుల వద్ద పాకిస్థాన్ ఆర్మీ, భారత సైన్యం అధికారులు పరస్పరం స్వీట్లు మార్పిడి చేసుకున్నారు. భారత ఆర్మీకి చెందిన వైట్ నైట్ కార్ప్స్ ఈ విషయాన్ని వెల్లడించింది. రంజాన్, దీపావళి వంటి పండుగల సందర్భాల్లో దాయాది దేశాల సైనిక అధికారులు మిఠాయిలు ఇచ్చిపుచ్చుకోవడం ఆనవాయితీగా వస్తున్నది. అయితే ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తలెత్తిన సందర్భాల్లో ఆర్మీ అధికారులు ఇలాంటి వాటికి దూరంగా ఉంటారు.