మహారాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని కర్నాటక, మహారాష్ట్ర సరిహద్దు వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మహారాష్ట్ర ఆవిర్భావం దినోత్సవం సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్నాటక సరిహద్దుల్లోని కొన్ని ప్రాంతాల్లో మరాఠీ మాట్లాడే ప్రజలున్నారని, ఆ ప్రాంతాలను మహారాష్ట్రలో కచ్చితంగా కలిపేస్తామని అజిత్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, ఎన్సీపీ సీనియర్ నేత అజిత్ పవార్ మాట్లాడుతూ.. బెల్గాం, నిపాణీ, కార్వార్ లాంటి సరిహద్దు ప్రాంతాలతో పాటు మరికొన్ని ప్రాంతాలు మరాఠీ మాట్లాడే ప్రాంతాలున్నాయి. ఇవి కర్నాటక సరిహద్దు ప్రాంతాలు. ఇప్పటికీ మన రాష్ట్రంలో అవి భాగం కాలేదు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఒక్క హామీ ఇస్తున్నాను. మహారాష్ట్రలో భాగం కావడానికి ఆ ప్రజలు చేస్తున్న పోరాటానికి సంపూర్ణ మద్దతిస్తాం అని పవార్ ప్రకటించారు.
ఏమిటీ సరిహద్దు వివాదం…
ప్రస్తుతం కర్నాటక ప్రాంతంలో వున్న బెల్గాం తదితర సరిహద్దు ప్రాంతాల్లో మరాఠీ మాట్లాడే వారున్నారు. అప్పట్లో ఇవన్నీ మద్రాస్ ప్రెసిడెన్సీలో వుండేవి. అయితే ఈ ప్రాంతాలన్నీ మహారాష్ట్రకు చెందినవేననీ, మహారాష్ట్రలోనే తమను కలపాలని మహారాష్ట్ర ఏకీకరణ సమితి డిమాండ్ చేస్తోంది. 1956 జనవరి 17న జరిగిన ఘర్షణల్లో అనేక మంది తమ ప్రాణాలను కోల్పోయారు.