బిపిన్ రావత్… ఆర్మీ చీఫ్ గా సేవలందించి, తన కార్యదక్షత, నిరుపమానమైన ప్రతిభ, అశేషమైన దేశ భక్తితో అందరికీ తలలో నాలుకలా మెలిగారు. త్రివిధ దళాల మధ్య మరింత సమన్వయం సాధించడం కోసం కేంద్ర ప్రభుత్వం సీడీఎస్ అనే పదవిని సృష్టించింది. 2020 జనవరి 1 న బిపిన్ రావత్ ఈ బాధ్యతలను చేపట్టారు. అంతకు మునుపు ఆయన ఆర్మీలో వివిధ హోదాల్లో పనిచేశారు. విశేషించి చైనా, పాక్ సరిహద్దుల విషయంలో ఆయనకు అపారమైన పట్టుందని ఆర్మీ అధికారులు పేర్కొంటారు. ఈ సరిహద్దు ప్రాంతాల్లో ఆయన వివిధ హోదాల్లో తన విధులు నిర్వర్తించారు. చైనా, పాక్ దేశాలు ఏ సమయంలో ఎలా ప్రవర్తిస్తాయి? ఆ దేశాలను సరిహద్దుల్లో ఎదుర్కోవడం ఎలా? అన్న విషయంలో రావత్ పరిపూర్ణమైన అవగాహనతో ఉంటారన్న ప్రచారమూ ఉంది.
2016 లో భారత్లోని యూరీ బేస్ క్యాంప్పై ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. ఈ ఘటనలో 19 మంది జవాన్లు అమరులయ్యారు. దీనికి ప్రతీకారంగా ఎల్ఓసీ వెంబడి భారత సైన్యం సర్జికల్ స్ట్రైక్స్ చేసింది. ఈ సమయంలో రావత్ ఆర్మీ స్టాఫ్ వైస్ చీఫ్ గా బాధ్యతల్లో ఉన్నారు. 2019 లో పాకిస్తాన్ బాలాకోట్ తీవ్రవాద ట్రైనింగ్ క్యాంపులపై భారత వాయుసేన విరుచుకుపడుతూ దాడులు చేసింది.ఈ సమయంలో రావత్ భారత ఆర్మీ చీఫ్గా బాధ్యతల్లో ఉన్నారు. ఇక రావత్ కెరీర్లో మరో విశేషం జరిగింది. 2015 లో మణిపూర్లో ఆర్మీ కాన్వాయ్పై ఉగ్రవాదులు దాడి చేసి, మయన్మార్ పారిపోయారు. దీంతో భారత సైన్యం మయన్మార్ సరిహద్దుల్లోకి చొరబడి మరీ ఉగ్రవాదులను మట్టుబెట్టింది. ఈ ఆపరేషన్లో 21 మంది పారా మిలటరీ సైనికులు పాల్గొన్నారు. ఈ బృందానికి రావత్ నేతృత్వం వహించారు. ఈ ఘటన తర్వాతే బిపిన్ రావత్ సత్తా ఏమిటో ప్రభుత్వానికి తెలిసొచ్చింది.