న్యూఢిల్లీ: ప్రమాదకరమైన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ( Omicron variant ) దేశంలో కోరలు చాస్తున్నది. రెండు రోజుల క్రితం కర్ణాటక రాజధాని బెంగళూరులో ఇద్దరికి ఒమిక్రాన్ సోకినట్లు తేలగా.. ఇవాళ గుజరాత్లో మరో వ్యక్తికి ఒమిక్రాన్ పాజిటివ్ వచ్చింది. సౌతాఫ్రికా నుంచి గుజరాత్కు వచ్చిన ఓ వ్యక్తిలో ఒమిక్రాన్ వేరియంట్ ఉన్నట్లు బయటపడింది. దాంతో దేశంలో డేంజరస్ ఒమిక్రాన్ పాజిటివ్ కేసుల సంఖ్య మూడుకు చేరింది.
ఒమిక్రాన్ వేరియంట్ మొదటగా ఆఫ్రికా ఖండంలోని దక్షిణ దేశాల్లో గుర్తించారు. దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్ బయటపడగానే భారత్ సహా అన్ని దేశాలు ముందుజాగ్రత్త చర్యలు చేపట్టాయి. అయినా, ఆ వేరియంట్ ఇప్పటికే 38 దేశాలకు విస్తరించింది. ఒమిక్రాన్ వేగాన్ని చూసి అన్ని దేశాలు ఆందోళన చెందుతున్నాయి. ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందోనని భయంతో వణికిపోతున్నాయి.