పట్నా: ఒమిక్రాన్ వేరియంట్ (Omicron) కరోనా వైరస్ దేశంలో వేగంగా విస్తరిస్తున్నది. ఇప్పటికే దేశంలోని పలు రాష్ట్రాల్లో కాలుమోపిన ఈ వేరియంట్ తాజాగా బీహార్లో అడుగుపెట్టింది. అక్కడ మొట్టమొదటి ఒమిక్రాన్ కేసు నమోదైంది. దీనిపై బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ స్పందించారు. రాష్ట్రంలో ఒమిక్రాన్ ప్రభావం మొదలైందని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. అందరూ జాగ్రత్తగా కొవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు.
ప్రస్తుతం ఒమిక్రాన్ వేరయింట్ను నిర్ధారించే సౌకర్యం బీహార్లో లేదు. శాంపిల్స్ పంపితే ఢిల్లీ నుంచి రిపోర్ట్స్ రావాలి. రాష్ట్రంలో ఒమిక్రాన్ విస్తరించకుండా అడ్డుకట్ట వేసే విషయమై ఈ సాయంత్రం ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించబోతున్నా. మహిళలు, సమాజ శ్రేయస్సు కోసం బీహార్లో జరిగిన అభివృద్ధి పనులపై కూడా ఆ సమావేశంలో చర్చించనున్నాం. ఒమిక్రాన్ కేసు నమోదైన నేపథ్యంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలి. కొవిడ్ నిబంధనలు పాటించాలి అని సీఎం నితీశ్ సూచించారు.