లక్నో: ఆఫీసుకు రాకుండా గత ఆరు నెలలుగా జీతం తీసుకుంటున్న ప్రభుత్వ అధికారిణిని ఎట్టకేలకు సస్పెండ్ చేశారు. బీజేపీ పాలిత ఉత్తర ప్రదేశ్లో ఈ సంఘటన జరిగింది. డిప్యూటీ సీఎం కార్యాలయానికి చెందిన అధికారిణి డాక్టర్ ఇందు బాల శర్మ, అమ్రోహా జిల్లాలో విధులు నిర్వహిస్తున్నారు. అయితే ఆమె గత ఆరు నెలలుగా కార్యాలయానికి రావడం లేదు. అయినప్పటికీ ప్రతి నెలా జీతాన్ని ఆమె పొందుతున్నారు.
కాగా, ప్రభుత్వ కార్యాలయంలోని హాజరు పట్టీలో ఆ అధికారిణి నకిలీ సంతాకాలున్నట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో ఇందు బాల శర్మను సస్పెండ్ చేయాలని యూపీ డిప్యూటీ సీఎం బ్రిజేష్ పాఠక్ ఆదేశించారు. ఆమెపై శాఖాపరమైన విచారణకు సీఎం కార్యాలయం ఆదేశాలు జారీ చేసింది.
అలాగే వేతనాల జారీకి ఇన్చార్జిగా ఉన్న సంతోష్ కుమార్పై కూడా శాఖాపరమైన చర్యలకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ వ్యవహారంలో ప్రమేయం ఉన్న ప్రభుత్వ ఉద్యోగులందరిపైనా చర్యలు తీసుకోవడంతోపాటు కేసు నమోదు చేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.