IMD warning : రాగల మూడు రోజులపాటు ఒడిశా (Odisha) లో భారీ వర్షాలు (Heavy rians) కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం (IMD) వెల్లడించింది. దక్షిణ ఉత్తరప్రదేశ్ (South Uttarpradesh) నుంచి బంగాళాఖాతం (Bay of Bengal) వరకు ఆవరించి ఉన్న ఉపరితల ద్రోణి కారణంగా ఒడిశాలో మూడు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. ఈ మేరకు ఒడిశాలోని ఉత్తరాది జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కూడా జారీచేసింది.
‘దక్షిణ ఉత్తరప్రదేశ్ నుంచి బంగాళాఖాతం వరకు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల పైన ఉపరితల ద్రోణి ఆవరించి ఉంది. ఈ ద్రోణి పరభావంతో రాష్ట్రంలో మూడు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయి. కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కూడా కురిసే ఛాన్స్ ఉంది.’ అని ఐఎండీ భువనేశ్వర్ విభాగం డైరెక్టర్ మనోరమ మొహంతి అన్నారు. గడిచిన 24 గంటల్లో బమ్రా, సంబాల్పూర్ సహా ఆరు ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిశాయని పేర్కొంది.