భువనేశ్వర్ : బీజూ జనతాదళ్ పార్టీ నుంచి సస్పెండైన ఎమ్మెల్యే ప్రశాంత్ జగదేవ్ కారు బీభత్సం సృష్టించింది. ఆయన కారు జనాలపైకి దూసుకెళ్లడంతో 22 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఏడుగురు పోలీసులు ఉన్నారు. ఆగ్రహాంతో ఉన్న ప్రజలు.. ఎమ్మెల్యేపై తిరగబడి చితకబాదారు. ఎమ్మెల్యేకు కూడా తీవ్ర గాయాలయ్యాయి.
ఒడిశాలోని చిలికా నియోజకవర్గం ఎమ్మెల్యే ప్రశాంత్ జగదేవ్.. బనాపూర్కు చేరుకున్నారు. అక్కడ బ్లాక్ చైర్పర్సన్కు ఎన్నికలు జరుగుతుండటంతో జనాలు పెద్ద ఎత్తున గుమిగూడారు. అయితే ఎమ్మెల్యే కారు జనాలపైకి దూసుకెళ్లింది. 22 మందికి తీవ్ర గాయాలయ్యాయి. బనాపూర్ ఎస్ఐ ఆర్ ఆర్ సాహుతో పాటు మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఎలాంటి కారణం లేకుండానే జనాలపైకి ఎమ్మెల్యే కారు దూసుకురావడంతో స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేపై దాడి చేసి గాయపరిచారు. గాయపడ్డ వారంతా బీజేపీ కార్యకర్తలని తెలుస్తోంది. ఎమ్మెల్యేకు భువనేశ్వర్లోని తంగి హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు జగదేవ్ను గతేడాది బీజేడీ నుంచి సస్పెండ్ చేశారు.
.@bjd_odisha Chilika MLA Prasant Jagdev brutally mows down public in Banpur. Women & Lady police officers injured. The arrogance of power of @Naveen_Odisha and his MLA’s is clearly visible. #Odisha pic.twitter.com/OxSdP7Tr3v
— Sumit Kumar Behera (@SumitOdisha) March 12, 2022