జిజ్ఞాసకూ, వయస్సుకు ఏమాత్రం సంబంధముండదని ఒడిశా బీజేడీ ఎమ్మెల్యే నిరూపించారు. ఒడిశాకు చెందిన బీజద్ అనే నియోజకవర్గ ఎమ్మెల్యే పేరు అంగద్ కన్హార్. ఆయనకు 57 సంవత్సరాలు. అయినా.. ఆయన పదో తరగతి పరీక్షలకు హాజరయ్యారు. ఇతర విద్యార్థులతో కూర్చొని, పదో తరగతి పరీక్షలు రాశారు.
40 ఏళ్ల క్రితం ఆయన డ్రాపవుట్. మళ్లీ 40 ఏళ్ల తర్వాత ఆయన 10 వ తరగతి పరీక్షలకు హాజరయ్యారు. పరీక్షలు రాశారు. కుటుంబ ఒత్తిళ్లు, వ్యక్తిగత కారణాల రీత్యా తాను చదువు మానేశానని ఎమ్మెల్యే అంగద్ పేర్కొన్నారు. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ఓ సాధారణ విద్యార్థిగా పదో తరగతి పరీక్షలు రాశానని చెప్పుకొచ్చారు.
50 ఏళ్లు పైబడిన వారు కూడా ఈ పరీక్షలకు హాజరవుతున్నారని నా దృష్టికి వచ్చింది. అందుకే నేను పదో తరగతి పరీక్షలు రాయాలని ఫిక్స్ అయ్యా. పరీక్షలు రాయడానికి గానీ, చదువుకోడానికి గానీ వయస్సుతో ఏమాత్రం సంబంధం లేదు అని ఆయన స్పష్టం చేశారు.
డ్రైవర్ ప్రోత్సాహంతోనే పరీక్షలు రాసిన ఎమ్మెల్యే
దాదాపు 57 సంవత్సరాల వయస్సులో బీజేడీ ఎమ్మెల్యే అంగద్ కన్హార్ పదో తరగతి పరీక్షలు రాశారు. అయితే.. ఈ వయస్సులో ఆయన పరీక్షలు రాయడానికి ప్రోత్సహించిందెవరు? అన్న ప్రశ్న వస్తుంది. ఆయన స్పేహితులతో పాటు ఆయన కారు డ్రైవర్ ఈయనను ప్రోత్సహించారని ఎమ్మెల్యే వెల్లడించారు. పరీక్షలో పాస్ అవుతానో లేదో, తెలియదు కానీ.. పరీక్షలు మాత్రం రాశానని ఎమ్మెల్యే అంగద్ చెప్పుకొచ్చారు.