భువనేశ్వర్: ఒడిశా ఆరోగ్యశాఖ మంత్రి నవకిశోర్ దాస్పై గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులకు పాల్పడ్డారు. ఝార్సిగూడ జిల్లా బ్రజరాజునగర్లోని గాంధీచౌక్ దగ్గర ఈ కాల్పుల ఘటన చోటుచేసుకుంది. బ్రజరాజునగర్లో ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన తిరిగి వెళ్తుండగా కాల్పులు జరిగాయి. మంత్రిపై కాల్పులు జరిపిన వెంటనే దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు.
దుండగుల కాల్పుల్లో మంత్రి నవకిశోర్దాస్కు తీవ్ర గాయాలయ్యాయి. దాంతో ఆయనను చికిత్స నిమిత్తం హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. కాగా, మంత్రిపై కాల్పులు జరిపి పరారైన దుండగుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. దుండగులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.