అగర్తల: నలుగురు కుటుంబ సభ్యులను ఒక బాలుడు హత్య చేశాడు. అనంతరం ఇంటి వద్ద ఉన్న బావిలో వారి మృతదేహాలను పడేశాడు. త్రిపురలోని ధలై జిల్లాలో ఈ దారుణం జరిగింది. ఒడిశా కుటుంబానికి చెందిన 16 ఏళ్ల బాలుడు కుటుంబ సభ్యులతో కలిసి కమల్పూర్ సబ్డివిజన్లోని మారు మూల గ్రామంలో నివసిస్తున్నాడు. నేర సీరియల్స్ చూసే అతడు ఘోరానికి పాల్పడ్డాడు. తండ్రి ఇంట్లో లేని సమయంలో శనివారం రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న తల్లి, తాత, పదేళ్ల సోదరి, మేనత్తను గొడ్డలితో నరికి హత్య చేశాడు. ఇంటి పక్కనే ఉన్న బావిలో నలుగురి మృతదేహాలు పడేశాడు.
కాగా, ఇంటికి తిరిగి వచ్చిన బాలుడి తండ్రి అక్కడంతా రక్తంతోపాటు బావిలో మృతదేహాలు పడి ఉండటం చూశాడు. దీంతో షాక్ అయిన ఆయన, కేకలు వేసి గ్రామస్తులను పిలిచాడు. వారు దీనిపై పోలీసులకు సమాచారం ఇచ్చారు. శనివారం రాత్రి ఆ ఇంటి నుంచి పెద్దగా మ్యూజిక్ వినిపించిందని గ్రామస్తులు తెలిపారు. గతంలో ఆ ఇంట్లో చోరీ చేయడంతోపాటు, నేర సీరియల్స్ చూసే ఆ బాలుడి పనేనని అనుమానం వ్యక్తం చేశారు.
మరోవైపు పోలీసులు ఆ ఇంటికి చేరుకున్నారు. బావిలోని మృతదేహాలను బయటకు తీయించారు. పోస్ట్మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలపై గాయాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. మార్కెట్ ప్రాంతంలో ఉన్న ఆ బాలుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. నలుగురు కుటుంబ సభ్యులను ఎందుకు హత్య చేశాడు అన్నదానిపై ఆరా తీస్తున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్ట్మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత పూర్తి విషయాలు తెలుస్తాయని పోలీసులు వెల్లడించారు.