భువనేశ్వర్: ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ శనివారం 75వ ఏట అడుగుపెట్టారు. ఆయన పుట్టిన రోజును పురస్కరించుకుని ఒక అభిమాని 72 కేజీల భారీ చాక్లెట్ విగ్రహాన్ని తయారు చేశారు. ఖుర్దా జిల్లా బేగునియాకు చెందిన బేకరీ శిక్షకుడు రాకేష్ కుమార్ సాహు దీనిని రూపొందించారు. దేశంలో హాకీ క్రీడకు, భారత్ హాకీ టీమ్కు ఒడిశా ప్రభుత్వం గత కొన్నేండ్లుగా స్పాన్సర్గా వ్యవరిస్తున్నది. సీఎం నవీన్ పట్నాయక్ ఇచ్చిన ఈ ప్రోత్సాహంతో భారత హాకీ టీమ్ జపాన్ ఒలింపిక్స్లో మెడల్ సాధించింది.
ఈ నేపథ్యంలో సీఎం నవీన్ పట్నాయక్ చాక్లెట్ విగ్రహం వద్ద చాక్లెట్తో తయారు చేసిన హాకీ స్టిక్, హాకీ బాల్, ఒలింపిక్స్ సింబల్ను కూడా ఉంచారు. ఆరుగురి సహాయంతో 15 రోజులు శ్రమించి దీనిని రూపొందించినట్లు క్రీడల పట్ల మక్కువ ఉన్న రాకేష్ కుమార్ తెలిపారు. వర్క్షాప్లో ఉష్ణోగ్రత వ్యత్యాసం, తేమ స్థాయిలలో మార్పుల కారణంగా దీని తయారీకి పలు ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు చెప్పారు.
కాగా, 72 కేజీల నవీన్ పట్నాయక్ చాక్లెట్ విగ్రహాన్ని భువనేశ్వర్లోని కళింగా హాకీ స్టేడియంలో ఆ రాష్ట్ర క్రీడా మంత్రి టీకే బెహరా శనివారం ఆవిష్కరించారు. ఈ విగ్రహాన్ని స్టేడియంలో కొన్ని రోజులు ప్రదర్శిస్తామని ఆయన తెలిపారు. అనంతరం చాక్లెట్ ముక్కలను దివ్యాంగ విద్యార్థులకు పంపిణీ చేస్తామని వెల్లడించారు.
మరోవైపు కరోనా మహమ్మారి బారిన పడిన ప్రజలకు సంఘీభావంగా ఈ ఏడాది పుట్టిన రోజు వేడుకలకు దూరంగా ఉంటున్నట్లు సీఎం నవీన్ పట్నాయక్ శుక్రవారం తెలిపారు. తన బర్త్డే రోజున ప్రజల కోసం సామాజిక సేవా కార్యక్రమాల్లో నిమగ్నం కావాలని తన అభిమానులు, పార్టీ కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు. దీంతో బీజేడీ సామాజిక సేవా విభాగం రక్తదాన శిబిరాలు నిర్వహించగా 5,000 మందికి పైగా రక్తదానం చేసినట్లు ఆ పార్టీ నేతలు తెలిపారు.