న్యూఢిల్లీ, ఆగస్టు 9: ఓబీసీ జాబితాకు సంబంధించిన 127వ రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్రం సోమవారం లోక్సభలో ప్రవేశపెట్టింది. తమ సొంత ఓబీసీ జాబితాను తయారుచేసుకునే అధికారాన్ని మళ్లీ రాష్ర్టాలకే ఇచ్చేందుకు ఈ బిల్లును రూపొందించారు. దీన్ని బట్టి జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్కు ప్రతిపాదించకుండానే తమ పరిధిలో సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతులను గుర్తించే అధికారం ఆయా రాష్ర్టాలకు లభిస్తుంది. వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఓబీసీల మద్దతు కోసం బీజేపీ వ్యూహాత్మకంగా ఈ బిల్లును తీసుకొచ్చిందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ బిల్లును సామాజిక న్యాయం, సాధికారిత మంత్రి వీరేంద్రకుమార్ ప్రవేశపెట్టారు.
9 అప్పిలేట్ ట్రిబ్యునళ్ల రద్దుకు ఆమోదం
9 అప్పిలేట్ ట్రిబ్యునళ్ల రద్దుకు ఉద్దేశించిన బిల్లు పార్లమెంటు ఆమోదం పొందింది. ట్రిబ్యునళ్ల సంస్కరణ బిల్లుకు ఈ నెల 3న లోక్సభ, సోమవారం రాజ్యసభ ఆమోదముద్ర వేశాయి. రద్దయ్యేవాటి జాబితాలో ఫిలిమ్ సర్టిఫికేషన్ అప్పిలేట్ ట్రిబ్యునల్ కూడా ఉంది. న్యాయవ్యవస్థ స్వేచ్ఛను ఈ బిల్లు దెబ్బతీస్తుందని ప్రతిపక్షాల సభ్యులు వెల్లోకి దూసుకెళ్లి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వాదనను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఖండించారు. మరోవైపు, టాక్సేషన్ చట్టాల సవరణ బిల్లు ఆమోదం పొందింది. ఇదిలాఉండగా.. ప్రతిపక్షాల ఆందోళన మధ్యే కేంద్రం సోమవారం 6 బిల్లులను ప్రవేశపెట్టింది. వాటిలో మూడు ఆమోదం పొందాయి. వీటిని 10 నిమిషాల్లో ఆమోదించడాన్ని ఆరెస్పీ ఎంపీ ఎన్కే ప్రేమచంద్రన్ దోసెలు వేయడంతో పోల్చారు.