లక్నో: తనపై సామూహిక అత్యాచారం జరిగినట్లు ఒక నర్సు ఆరోపించింది. (Nurse Gang Raped) ప్రైవేట్ భాగాల్లో కర్ర చొప్పించడంతోపాటు కారంపొడి పోసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్లోని జలౌన్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఒక మహిళ స్టాఫ్ నర్సుగా పని చేస్తున్నది. గురువారం ఉదయం స్కూటీపై డ్యూటీకి వెళ్తున్నది. మార్గమధ్యలో కొందరు వ్యక్తులు అడ్డుకున్నారని తెలిపింది. కొట్టి చెట్లపొదల్లోకి లాక్కెళ్లారని చెప్పింది. నలుగురు వ్యక్తులు పట్టుకోగా ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపించింది. ప్రైవేట్ భాగంలోకి కర్రను చొప్పించడంతోపాటు కారంపొడి చల్లినట్లు ఫిర్యాదు చేసింది.
కాగా, బాధితురాలు తన భర్తకు ఫోన్ చేసి ఈ విషయం చెప్పింది. ఆమె భర్త సమాచారం ఇవ్వడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధిత మహిళను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఆమె ఫిర్యాదుపై కేసు నమోదు చేశారు.
మరోవైపు ఆ గ్రామంలోని మరో వ్యక్తితో ఆ మహిళకు వివాహేతర సంబంధం ఉన్నట్లు తెలిసిందని పోలీసులు తెలిపారు. దీంతో ఆ వ్యక్తి, అతడి కుటుంబ సభ్యులు ఆమెను కొట్టినట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో ఆ వ్యక్తి, అతడి కుటుంబ సభ్యులపై ఆమె తీవ్ర ఆరోపణలు చేసిందని అన్నారు. ఆమె ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.