ముంబై: మహ్మద్ ప్రవక్తపై వివాదస్పద వ్యాఖ్యలు చేసి బీజేపీ నుంచి సస్పెండైన ఆ పార్టీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ, గత ఐదు రోజులుగా కనిపించడం లేదు. దీంతో ముంబై పోలీసులు ఆమె కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. మహ్మద్ ప్రవక్తపై నుపుర్ శర్మ చేసిన వివాదస్పద వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటాయి. పలు ముస్లిం దేశాలు కూడా భారత్పై అసంతృప్తి వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో ముస్లిం సంస్థ అయిన రజా అకాడమీ సంయుక్త కార్యదర్శి ఇర్ఫాన్ షేక్, నుపుర్ శర్మ వ్యాఖ్యలపై ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మే 29న ఆమెపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆమె స్టేట్మెంట్ రికార్డు కోసం జూన్ 25న హాజరుకావాలంటూ ఈ నెల 11న సమన్లు జారీ చేశారు.
ఈ నేపథ్యంలో ఢిల్లీలో నివసిస్తున్న నుపుర్ శర్మకు నోటీసు అందజేసేందుకు ముంబై పోలీసుల బృందం ఇటీవల అక్కడకు వెళ్లింది. అయితే ఢిల్లీలోని నివాసం వద్ద ఆమె ఆచూకీ లేదు. దీంతో గత ఐదు రోజులుగా ఢిల్లీలో ఉన్న ముంబై పోలీసులు ఆమె కోసం గాలిస్తున్నారు.
కాగా, నుపుర్ శర్మపై ముంబైతోపాటు ఢిల్లీ, కోల్కతా వంటి పలు నగరాల్లో కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో స్టేట్మెంట్ రికార్డు కోసం ఈ నెల 20న పోలీస్ స్టేషన్కు రావాలంటూ కోల్కతా పోలీసులు కూడా ఇటీవల ఆమెకు సమన్లు పంపారు.