న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు నీట్ ఎగ్జామ్ నిర్వహిస్తున్న విషయం విదితమే. అయితే ఇటీవల నిర్వహించిన నీట్ యూజీ-2021 ఎగ్జామ్లో ఒక ప్రశ్న తప్పుగా ముద్రించినందుకు కొందరు విద్యార్థులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై కోర్టు విచారణ చేపట్టి కీలక ఆదేశాలు జారీ చేసింది. నీట్ ఎగ్జామ్లో ఫిజిక్స్ నుంచి ప్రశ్నను తప్పుగా ముద్రించినందున, ఆ ప్రశ్నను తొలగించాలని సూచించింది. నీట్ ఫలితాలు మళ్లీ విడుదల చేయాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ( NTA ) ని కోర్టు ఆదేశించింది.
ఇక ఫిజిక్స్ నుంచి ఇచ్చిన ప్రశ్నలో తప్పులు దొర్లిన విషయంలో కచ్చితత్వాన్ని అంచనా వేయడానికి ముగ్గురు నిపుణుల కమిటీ వేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. నిపుణుల కమిటీ అభిప్రాయాన్ని, సూచనలను కోర్టుకు దాఖలు చేయాలని సూచన చేసింది. తదుపరి విచారణను ఈ నెల 30కి కోర్టు వాయిదా వేసింది.