న్యూఢిల్లీ : ఈ ఏడాది ఏప్రిల్లో తిరువనంతపురంలో జరిగిన హిందూ సమ్మేళనం ప్రకంపనలు ఇంకా సమసిపోలేదు. అనంతపురి హిందూ మహాసమ్మేళనంలో మాట్లాడిన వివాదాస్పద రాజకీయనేత పీసీ జార్జ్ను ముస్లింలకు వ్యతిరేకంగా ఆరోపణలు చేసినందుకు అరెస్ట్ చేయగా ఈ భేటీలో ఓ ఎన్ఆర్ఐ చేసిన వ్యాఖ్యలు ఆన్లైన్లో దుమారం రేపాయి. గల్ఫ్లో టెర్రరిస్టులకు సెక్స్ బానిసలుగా మళయాళీ నర్సులను రిక్రూట్ చేసుకుంటున్నారని ఖతర్లో ఓ కంపెనీలో పనిచేస్తున్న ఆరెస్సెస్ కార్యకర్త దుర్గాదాస్ శిశుపాలన్పై విమర్శలు వెల్లువెత్తాయి.
దుర్గాదాస్పై చర్యలు చేపట్టాలని కోరుతూ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశామని నర్సుల అసోసియేషన్ యూఎన్ఐక్యూ (యునైటెడ్ నర్సెస్ ఆఫ్ ఇండియా ఖతార్) వెల్లడించింది. దుర్గాదాస్ అడిగిన ప్రశ్నకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో నెటిజన్లు ఆయనపై చర్యలకు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు మళయాళాన్ని ప్రోత్సహించేందుకు కేరళ ప్రభుత్వ ప్రోద్బలంతో పనిచేస్తున్న మళయాళం మిషన్ ఖతార్ యూనిట్ నుంచి ఆయనను తప్పిస్తున్నట్టు తెలిపింది.
ఇక నారంగ్ ప్రాజెక్ట్స్ నుంచి దుర్గాదాస్ను తొలగిస్తున్నట్టు కంపెనీ యాజమాన్యం పేర్కొంది. కాగా ఫేస్బుక్ లైవ్లో దుర్గాదాస్ తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. తాను గల్ఫలో 20 ఏండ్ల నుంచి పనిచేస్తున్నానని 30 ఏండ్లుగా స్వయంసేవక్గా ఉన్నానని చెప్పారు. హిందూ సమ్మేళనంలో తాను అడిగిన ప్రశ్నను వీడియో క్లిప్లో చూసినవారికి తప్పుగా అర్ధం అయినట్టు ఉందని అన్నారు. తన ప్రశ్నపై నర్సులు ఎవరైనా బాధపడితే వారికి తాను క్షమాపణలు చెబుతున్నానని పేర్కొన్నారు.