Smart Card : స్మార్ట్కార్డు యూజర్స్కు రైల్వేశాఖ శుభవార్త చెప్పింది. స్మార్ట్కార్డు ఉన్న ప్రయాణికులు ఇక నుంచి ఆన్లైన్లోనే తమ కార్డులను రీచార్జ్ చేసుకునే అవకాశం కల్పించింది. ఈ మేరకు రైల్వే శాఖ ఒక ప్రకటన చేసింది. తాజా వెసులుబాటుతో స్మార్ట్కార్డు ఉన్న ప్రయాణికులు ‘UT Sonmobile’ వెబ్ పోర్టల్లో నమోదు చేసుకోవడం ద్వారా తమ కార్డులను ఆన్లైన్లో రీఛార్జ్ చేసుకునే అవకాశం లభిస్తుంది.
దీనిపై దక్షిణ మధ్య రైల్వేకు చెందిన ఓ సీనియర్ అధికారి మాట్లాడుతూ.. గతంలో స్మార్ట్కార్డులో బ్యాలెన్స్ అయిపోతే ప్రయాణికులు రీచార్జ్ కోసం బుకింగ్ కౌంటర్స్ దగ్గరికి రావాల్సి వచ్చేదని, గంటల తరబడి లైన్లలో నిలబడాల్సి వచ్చేదని చెప్పారు. దానివల్ల స్మార్ట్కార్డు యూజర్ సమయం ఎక్కువగా వృథా అయ్యేదన్నారు. ఆ సమస్యకు పరిష్కారంగానే ఇప్పుడు ఆన్లైన్లో స్మార్ట్ కార్డ్ రీచార్జ్ సదుపాయం కల్పిస్తున్నట్లు తెలిపారు.
తాజా సదుపాయంతో బుకింగ్ కౌంటర్ల దగ్గర రద్దీ కూడా తగ్గుతుందని రైల్వే అధికారులు చెప్పారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో బుకింగ్ కౌంటర్ల వద్ద రద్దీ తగ్గడంవల్ల చాలా ప్రయోజనం ఉంటుందన్నారు. కౌంటర్ల వద్ద రద్దీని నివారించడానికి స్మార్ట్ కార్డ్ వినియోగదారులంతా ఆన్లైన్ పద్దతిని వాడుకోవాలని సూచించారు. ఈ కొత్త సౌకర్యాన్ని ప్రయాణికులు స్వాగతిస్తారని ఆశిస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్య చెప్పారు.