ముంబై : సూపర్ మార్కెట్లు, స్టోర్స్లో మద్యం విక్రయాలను అనుమతించే విధానానికి మహారాష్ట్ర క్యాబినెట్ గురువారం ఆమోదముద్ర వేసింది. 1000 చదరపు గజాలు అంతకుమించిన విస్తీర్ణంలో ఉన్న సూపర్ మార్కెట్లు, స్టోర్లలో స్టాల్ ద్వారా మద్యం విక్రయాలకు అనుమతిస్తూ సీఎం ఉద్ధవ్ ఠాక్రే అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని రాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ వెల్లడించారు.
ఈ నిర్ణయం వైన్ తయారీదారులతో పాటు మహారాష్ట్ర రైతాంగానికీ మేలు చేస్తుందని మంత్రి చెప్పారు. సూపర్ మార్కెట్లు, స్టోర్లలో మద్యం విక్రయాలతో రాష్ట్ర సర్కార్కు ఆదాయం కూడా సమకూరుతుందని అన్నారు. ఈ నిర్ణయంతో రాష్ట్ర ఖజానాకు రూ కోట్ల విలువైన ఆదాయం వస్తుందని చెప్పారు. ఇక తాజా నిర్ణయంతో మహారాష్ట్రలో కనీస విస్తీర్ణం కలిగిన సూపర్ మార్కెట్లు, జనరల్ స్టోర్స్, వాక్-ఇన్-స్టోర్స్లో మద్యం త్వరలో అందుబాటులోకి రానుంది.
ఇక దేశీ వైన్ పరిశ్రమలో 65 శాతం యూనిట్లు మహారాష్ట్రలోనే ఉన్నాయి. వీటిలో అధిక శాతం యూనిట్లు నాసిక్, సంగ్లి, పుణే, సోలాపూర్, బుల్ధానా, అహ్మద్నగర్ జిల్లాల్లో ఉన్నాయి. మరోవైపు సూపర్ మార్కెట్లు, స్టోర్స్లో మద్యం విక్రయాలకు అనుమతిస్తూ ఠాక్రే నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వం అనుమతించడంపై కాషాయపార్టీ భగ్గుమంటోంది. వీధివీధినా మద్యం దుకాణాలను తెరుస్తున్నారని ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమాలకు బీజేపీ సన్నద్ధమవుతోంది.