ముంబై: మహారాష్ట్రకు చెందిన నేషలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) సీనియర్ నేత అజిత్ పవార్ (Ajit Pawar) మరోసారి గళమెత్తారు. అసెంబ్లీలో ప్రతిపక్ష నేత బాధ్యతల నుంచి తనను తప్పించాలని పార్టీని కోరారు. అలాగే పార్టీలో ఎలాంటి పదవి అయినా తనకు కేటాయించాలని డిమాండ్ చేశారు. ముంబైలో బుధవారం జరిగిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) 24వ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమంలో అజిత్ పవార్ ఈ డిమాండ్ను తెరపైకి తెచ్చారు. ప్రతిపక్ష నేతగా ఆయన కఠినంగా వ్యవహరించడం లేదన్న విమర్శలు రావడంపై ఈ మేరకు స్పందించారు. అసెంబ్లీలో ప్రతిపక్ష నేత పదవిపై తనకు ఎలాంటి ఆసక్తి లేదని చెప్పారు. పార్టీ ఎమ్మెల్యేల డిమాండ్ మేరకే దానికి అంగీకరించినట్లు తెలిపారు. పార్టీ తనకు ఏదైనా పదవిని కేటాయించినా, ఏ బాధ్యత అప్పగించినా దానికి పూర్తి న్యాయం చేస్తానని మీడియాతో అన్నారు. తన డిమాండ్పై పార్టీ నాయకత్వమే తగిన నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు.
కాగా, అజిత్ పవార్ గతంలో ఎంవీఏ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా ఉన్నారు. అయితే శివసేనలో తిరుగుబాటు కారణంగా ఆ ప్రభుత్వం పడిపోయింది. ఈ పరిణామాల నేపథ్యంలో గత ఏడాది జూలైలో అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడి బాధ్యతలను ఆయన చేపట్టారు. అయితే గతంలో బీజేపీకి మద్దతిచ్చిన అజిత్ పవార్, ఆ పార్టీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటుకు ప్రయత్నించారు. డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేసిన ఆయన ఎన్సీపీని చీల్చేందుకు యత్నించారు. అయితే ఎన్సీపీ అధినేత శరద్ పవార్, ఆయన కుటుంబ సభ్యులు బుజ్జగించడంతో అజిత్ పవార్ దిగి వచ్చి ఆ పదవికి రాజీనామా చేశారు.
మరోవైపు శరద్ పవార్ ఇటీవల తన కుమార్తె, ఎంపీ సుప్రియా సూలే మరో సీనియర్ నేత ప్రఫుల్ పటేల్ను వర్కింగ్ ప్రెసిడెంట్లుగా నియమించారు. సుప్రియాకు మహారాష్ట్ర బాధ్యతలు, ప్రఫుల్కు ఇతర రాష్ట్రాల పార్టీ బాధ్యతలను అప్పగించారు. అయితే పార్టీ పదవి తనకు దక్కకపోవడంతో అజిత్ పవార్ నాటి నుంచి అసంతృప్తిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష నేత బాధ్యతల నుంచి తనను తప్పించి పార్టీ పదవి ఇవ్వాలని తాజాగా డిమాండ్ చేశారు.