ధన్బాద్, జార్ఖండ్: ఉదయాన్ని జాగింగ్కు వెళ్లిన ఓ డిస్ట్రిక్ట్ అండ్ అడిషనల్ జడ్జిని హత్య చేశారు. బుధవారం ఉదయం ఈ ఘటన జరగగా మొదట దీనినో ప్రమాదంగానే అందరూ భావించారు. హిట్ అండ్ రన్ కేసు నమోదు చేశారు. అయితే తాజాగా బయటపడిన సీసీటీవీ ఫుటేజీ ఇది హత్యేనని తేల్చింది. జార్ఖండ్లోని ధన్బాద్ జిల్లా జడ్జిగా ఉన్న ఉత్తమ్ ఆనంద్ బుధవారం ఉదయం 5 గంటల సమయంలో జాగింగ్కు వెళ్లారు. ఈ సమయంలో వెనకి నుంచి వేగంగా వచ్చిన టెంపో ఆయనను ఢీకొట్టి వెళ్లిపోయింది. టెంపో డ్రైవర్ కావాలనే జడ్జి వైపు వెళ్లి ఢీకొట్టినట్లు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది. ఈ హత్యను సీరియస్గా తీసుకున్న చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎన్వీ రమణ.. జార్ఖండ్ హైకోర్టు జడ్జితో మాట్లాడారు.
మాఫియా పనేనా?
అంతేకాదు ఈ హత్య చేయడానికి కొన్ని గంటల ముందే ఆ వాహనాన్ని దొంగిలించినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇప్పటికే ఆ డ్రైవర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంటి నుంచి అర కిలోమీటర్లోపే ఉత్తమ్ ఆనంద్ను ఆ వాహనం ఢీకొట్టింది. చాలాసేపటి వరకూ రక్తం మడుగులో ఆయన అలా రోడ్డుమీదే పడి ఉన్న తర్వాత ఓ వ్యక్తి గమనించి హాస్పిటల్కు తీసుకెళ్లగా.. అక్కడ ఆయన మరణించారు.
పోలీసులు గతంలో జడ్జి ఆనంద్ విచారణ జరిపిన కేసులపై దృష్టి సారించారు. ఆయన ధన్బాద్లో ఎన్నో మాఫియా హత్యల కేసులను చూస్తున్నారు. ఈ మధ్యే ఇద్దరు గ్యాంగ్స్టర్లకు బెయిల్ కూడా నిరాకరించారు. మరోవైపు ఈ అంశాన్ని సీరియస్గా తీసుకున్న సీజేఐ రమణ.. హైకోర్టు చీఫ్ జస్టిస్తో మాట్లాడారు. ఈ కేసును హైకోర్టు చీఫ్ జస్టిస్ తీసుకున్నారు. ఈ కేసు గురించి మాకు తెలుసు. మేము చూసుకుంటాం అని ఆయన అన్నారు.