న్యూఢిల్లీ : ఈడీ కేసు కాస్తా బాలీవుడ్ భామల మధ్య పోరుకు తెరలేపింది. బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్పై మరో నటి నోరా ఫతేహి పరువు నష్టం దావా వేశారు. జాక్వెలిన్ ఫెర్నాండెజ్ దురుద్దేశపూరిత కారణాలతో తన ప్రతిష్టను దెబ్బతీసిందని నోరా ఫతేహి ఆరోపించారు.తామిద్దరం ఒకే ఇండస్ట్రీలో ఉంటూ ఒకే నేపధ్యం కలిగిన వారు కావడంతో తన కెరీర్ను నాశనం చేసేందుకు జాక్వెలిన్ వ్యవహరించిందని నోరా తాను దాఖలు చేసిన పిటిషన్లో ఆరోపించింది.
సుఖేష్ చంద్రశేఖర్పై దాఖలైన మనీ ల్యాండరింగ్ కేసులో ఈడీ ఇప్పటికే జాక్వెలిన్ ఫెర్నాండెజ్, నోరా ఫతేహిలను విచారించింది. సుఖేష్ చంద్రశేఖర్ నుంచి బహుమతులు పొందిన నోరా ఫతేహి వంటి సెలబ్రిటీలను సాక్షులుగా చేసినందున ఈడీ తనను తప్పుగా ఇంప్లీడ్ చేసిందని పీఎంఎల్ఏ కోర్టులో జాక్వెలిన్ లిఖితపూర్వకంగా పేర్కొనడంపై నోరా పరువు నష్టం కేసు నమోదు చేసింది.
ఈ వ్యవహారంతో తనకు ఎలాంటి సంబంధం లేదని తనపై వచ్చిన ఆరోపణలను నోరా తోసిపుచ్చింది. ఫిర్యాదుదారు, నిందితురాలు విదేశీ సంతతికి చెందిన నటీమణులు కావడం, ఇద్దరూ సినీ పరిశ్రమలో ఎన్నో కష్టాలకోర్చి పైకి ఎదిగిన క్రమంలో ఫిర్యాదుదారుకు ఎలాంటి సంబంధంలేని వ్యవహారంలోకి ఆమెను లాగడం దుర్మార్గమని పరువు నష్టం దావా పేర్కొంది. జాక్వెలిన్ కనుసన్నల్లో పలు మీడియా సంస్ధలు తనను వెంటాడటం మూక దాడితో సమానమని నోరా ఆరోపించింది.